TS : గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోయింది : ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి
పంచాయతీ కార్యదర్శుల సమ్మెతో గ్రామాల్లో అభివృద్ధి అడుగంటిపోయిందని ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్కు ఆయన బహిరంగ లేఖ రాశారు. రెగ్యులరైజేషన్ గురించి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దిక్కులేని పరిస్థితిలో పంచాయతీ కార్యదర్శులు సమ్మెకు దిగారని అన్నారు. వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. తక్షణమే వారికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. విధుల్లో నుంచి తొలగిస్తామని బెదిరింపులకు దిగడం సరికాదని.. వెంటనే సమస్యలు పరిష్కరించాలని అన్నారు.
రోజుకు 12 గంటల పనిభారంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సతమతం అవుతున్నారని ఉత్తమ్ పేర్కొన్నారు. వారికి పనికి మించి బాధ్యతలు అప్పగించడంతో తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. ఒత్తిడి తట్టుకోలేక 15వందల మంది ఉద్యోగాలు వదిలేశారని అన్నారు. ఇంకా గ్రామ కార్యదర్శుల రెగ్యులర్పై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇచ్చిన హామీకే దిక్కులేకపోతే రాష్ట్రంలో పాలన ఉన్నట్టా? లేనట్టా అని ప్రశ్నించారు. పంచాయతీ కార్యదర్శులకు వెంటనే న్యాయం చేయాలని.. లేకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com