TS : తన చితిని తానే పేర్చుకొని ఆత్మహత్య చేసుకున్న వృద్ధుడు

TS : తన చితిని తానే పేర్చుకొని ఆత్మహత్య చేసుకున్న వృద్ధుడు

సిద్దిపేట జిల్లా పొట్లపల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వంతుల జీవితం భారమై ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అదీ కూడా తన చితిని తానే పేర్చుకొని మరీ సూసైడ్‌ చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా పొట్లపల్లి గ్రామానికి చెందిన మెడబోయిన వెంకటయ్య కు నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమారుల్లో ఇద్దరు పొట్లపల్లిలో ఒకరు హుస్నాబాద్ లో మరొకరు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబ్ పేటలో నివసిస్తున్నారు. వెంకటయ్య భార్య గత కొంత కాలం క్రితం చనిపోయింది. తనకున్న నాలుగు ఎకరాల భూమిని కుమారులకు పంచి ఇచ్చేశాడు. కుమారులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. వెంకటయ్య కు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. గ్రామంలోనే ఆయన పెద్ద కుమారుడు కనకయ్య వద్ద ఉండేవాడు. అయితే ఆయన పోషణ విషయంలో ఐదు నెలల క్రితం పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. నెలకు ఒకరి చొప్పున నలుగురు కుమారులు వంతుల వారిగా పోషించాలని నిర్ణయించారు.

కొంత కాలం గడిచాక తండ్రిని సాకడం కోసం కొడుకులు లెక్కలు చేసుకున్నారు..వంతుల వారిగా పోషించాలన్న కుమారుల నిర్ణయాన్ని ఆ కన్నతండ్రి జీర్ణించుకోలేకపోయాడు. తన సొంతూరిని వదిలి మరో ఊరికి వెళ్లడం ఇష్టం లేక ప్రాణాలే విడిచాడు. తన పోషణ తనయులకు భారం కాకూడదనుకున్నాడేమో ఎవరికి చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయి ఆత్మహతికి పాల్పడి తనువు చాలించాడు.

మరోవైపు స్వగ్రామంలో ఉంటున్న పెద్ద కుమారుడు కనకయ్య వద్ద వంతు పూర్తి కావడంతో నవాబుపేటలో ఉంటున్న కుమారుడి వద్దకు వెంకటయ్య వెళ్లాల్సి ఉంది. సొంత ఊరు, ఇంటిని వదిలి అక్కడికి తాను వెళ్ళనని వెంకటయ్య చెప్పేవారు. ఈనెల 2న ఇంటి నుంచి వెళ్లిన ఆయన గ్రామంలో ఓ ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్లి రాత్రి అక్కడే ఉన్నారు. అక్కడ తన బాధనంతా చెప్పుకున్నాడు. 3వ తేదీన నవాబుపేటలోని మరో కుమారుడి ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్లిపోయాడు. సాయంత్రం వరకు ఏ కుమారుడి ఇంటికి వెళ్లలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలు, నవాబుపేట రోడ్డులో వెతికినా ఆచూకీ దొరకలేదు. అయితే నిన్న గ్రామంలో ఎల్లమ్మ గుట్ట వద్ద మంటల్లో కాలిన స్థితిలో వృద్ధుడి మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం వెంకటయ్య దేనని కుటుంబ సభ్యులు గుర్తించారు.ఘటనా స్థలంలో తాటాకులను ఒక చోట కుప్పగా వేసి వాటికి నిప్పంటించి, అందులో దూకి ఆత్మహత్యకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.. తన సొంత ఊరిని వదిలి వేరే ప్రాంతం కి వెళ్లలేక మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్న వెంకటయ్య మరణంలో పొట్లపల్లిలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Tags

Next Story