Bhadradri Kothagudem: పదేళ్ల పాప అలక.. చీకట్లోనే పాతిక కిలోమీటర్లు..
Bhadradri Kothagudem: పిల్లలకు కోపం వస్తే అలుగుతారు. కాని ఈ పదేళ్ల పాప మాత్రం అలిగి ఏకంగా పాతిక కిలోమీటర్లు నడిచింది. ఇంట్లో పెద్దోళ్లు తిట్టినందుకు రాత్రి, చీకటి అనే భయం కూడా లేకుండా కాలినడకన సొంతూరుకు బయల్దేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో ఉంటున్న రేణుక.. తన అత్తమ్మ ఇంట్లో ఉండి చదువుకుంటోంది. పిల్లలన్నాక అల్లరి, పెద్దోళ్లన్నాక అరవడం సహజమే. కాని, రేణుక మాత్రం కాస్త గట్టిగానే అలిగి.. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్దామనుకుంది.
రేణుక పేరెంట్స్ మిర్యాలగూడ దగ్గర్లోని దేవరతిపల్లిలో ఉంటారు. దూరాభారం లెక్కచేయకుండా, రాత్రీపగలు అనేది చూడకుండా యాత్ర మొదలుపెట్టింది. పాతిక కిలోమీటర్లు నడిచాక.. తెల్లవారుజామున 3 గంటలకు భద్రాచలం చేరుకుంది. పాప ఒంటరిగా నడుచుకుంటూ వస్తుండడాన్ని చూసిన భద్రాచలం పోలీసులు పాపను ఆపి వివరాలు ఆరా తీశారు. ప్రస్తుతం రేణుకను భద్రాచలంలోని శిశు గృహ సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉంచారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com