Nagole: స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయిన బాలుడు.. అధికారుల చర్యలు..

Nagole: హైదరాబాద్ నాగోల్లో బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్ను GHMC అధికారులు సీజ్ చేశారు. స్విమ్మింగ్ పూల్ వద్ద తనిఖీలు చేసిన అధికారులు ఎలాంటి అనుమతులూ లేవని తేల్చారు.. యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్ వద్ద.. మృతుడు మనోజ్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.
స్విమ్మింగ్ పూల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బాబు ప్రాణాలు కోల్పోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మనోజ్ మృతికి కారణమైన స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటన జరిగి గంటలు గడుస్తున్నా.. ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఇటు వైపు కన్నెత్తి చూడలేదన్న బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధనవంతులకు ఓ న్యాయం.. పేదలకు మరో న్యాయమా అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల పక్షపాత ధోరణిపై మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. నిన్న సాయంత్రం నాగోల్లోని సమతపురి కాలనీలోని స్విమ్మింగ్పూల్లో మనోజ్ మృతి చెందాడు. వేసవి సెలవుల్లో భాగంగా లింగంపల్లి నుంచి నాగోల్లోని అమ్మమ్మవాళ్లింటికి వచ్చిన మనోజ్.. ఫ్రెండ్స్తో కలిసి సరదాగా సమతపురి కాలనీలోని బ్లూ ఫ్యాట్ స్విమ్మింగ్ పూల్కు ఈతకు వెళ్లాడు.
స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు కనీసం ట్యూబ్ కూడా ఇవ్వకపోవడంతో మనోజ్ నీటిలో మునిగి చనిపోయాడు. మనోజ్ మృతితో సమతపురి కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక బ్లూ ఫ్యాట్ స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుల తీరుపై బాధిత కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com