తాను మరణిస్తూ మరో ఐదుగురికి పునర్జన్మ... !
తానూ మరణిస్తూ మరో అయిదుగురికి పునర్జన్మనిచ్చాడు ఓ తాపీమేస్త్రీ.. ఇక వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్నగర్ జిల్లా రామచంద్రాపురానికి చెందిన జాజిలి కిష్టయ్య, సత్తెమ్మ దంపతులకు రెండో కుమారుడైన రాములు(24) స్థానికంగా తాపీమేస్త్రీగా పనిచేస్తూ తన వృద్దతల్లిదండ్రులను, గర్భవతియైన భార్యను పోషించుకుంటున్నాడు. అయితే ఎప్పటిలాగే ఉదయం పనికి సిద్ధమైన రాములుకు ఉన్నట్టుండి రెండు కాళ్లు, రెండు చేతులు చచ్చుబడి పోవటంతో ఆందోళన చెందిన కుటుంబీకులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అక్కడ రాములు పరిస్థితిని పరిశీలించిన వైద్యులు.. అతని పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాదుకి తరలించాలని సూచించారు. దాంతో వారు వెంటనే మలక్పేటలోని యశోద దవాఖానాకు తీసుకెళ్తుండగా, మార్గమధ్యలో రాములు నోరు మూగబోయింది. ఆసుపత్రిలో చేర్పించిన తరవాత కొన్ని పరీక్షలు చేసిన వైద్యులు రాములుకి బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. కన్న కొడుకు కళ్ల ముందు విగత జీవిలా పడివుండటాన్ని చూసిన తల్లిదండ్రులు, గర్భవతియై ఎన్నో కలలు కంటున్న రాములు భార్య అరుణ ఎంతగానో రోదించారు.
బాధలో ఉన్నవారికి వైద్యులు అవయవ దానంపై అవగాహన కల్పించారు. దీనితో రాములు అవయవాలను ఐదుగురికి దానం చేసేందుకు రాములు తల్లిదండ్రులు, భార్య అరుణ ఒప్పుకున్నారు. తాను మరణిస్తూ మరో ఐదుగురికి పునర్జన్మనిచ్చిన రాములు కుటుంబం పట్ల వైద్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com