Kamareddy: కామారెడ్డిలో మంకీపాక్స్ కలకలం.. అది ప్రాణాంతక వ్యాధి కాదంటున్న డీహెచ్..
Kamareddy: ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్న మంకీపాక్స్ ఇప్పుడు తెలంగాణలో వెలుగు చూడటం తీవ్రకలవరపాటుకు గురిచేస్తోంది. కరోనా తగ్గుముఖం పడుతుందనుకుంటున్న క్రమంలో మంకీపాక్స్ విస్తరించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. దీంతో రాష్ట్రంలోని వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. విదేశాలనుంచి వచ్చేవారిని తనిఖీలను ముమ్మరం చేశారు.
కామారెడ్డి జిల్లాలో మంకీపాక్స్ కలకలం రేపింది. కువైట్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి లక్షణాలు ఉన్నట్లు తెలిసింది. దీంతో అతన్ని హుటా హుటిన హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కువైట్ నుంచి ఆ వ్యక్తి 15 రోజుల క్రితం వచ్చాడు. అతని శాంపిల్స్ సేకరించిన వైద్యులు పుణె వైరాలజీ ల్యాబ్కు పంపించారు. ప్రజలు ఆందోళన చెందొద్దని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని స్పష్టంచేశారు. మంకీపాక్స్ ప్రాణాంతక వ్యాధి కాదన్నారు. కామారెడ్డి ఇందిరానగర్ కాలనీకి చెందిన 40 ఏళ్ల వ్యక్తిలో ఈ లక్షణాలు ఉన్నాయన్నారు డీహెచ్ శ్రీనివాసరావు. జులై 6న కువైట్ నుంచి అతను వచ్చారని.. 20వ తేదీన అతనికి జ్వరం వచ్చిందన్నారు. 23న లక్షణాలు కనిపించడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడని.. అక్కడి వైద్యులు మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి.. జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారన్నారు. అక్కడి నుంచి 108లో ఫీవర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు ఒక దేశం నుంచి మరో దేశానికి మంకీపాక్స్ పాకుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది..వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. W.H.O.సాదారణంగా ఒక వ్యాధి ఒక దేశం నుంచి మరో దేశానికి పాకుతూ ప్రజా ఆరోగ్యానికి ఆందోళనకరంగా మారితే అప్పుడు హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటిస్తారు.. ఇప్పటికే 70కి పైగా దేశాల్లో మంకీపాక్స్ కలకలం రేపుతున్న నేపధ్యంలో అయాదేశాలు మంకీపాక్స్ పై పోరాడేందుకు సిద్ధం అవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికతో అన్ని దేశాలు మరోసారి అప్రమత్తమయ్యాయి. కఠిన ఆంక్షల దిశగా సాగుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com