ఇవాళ మధ్యాహ్నం కోర్టు ముందుకు అఖిలప్రియ!

బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో పోలీస్ కస్టడీ ముగియడంతో అఖిల ప్రియను మధ్యాహ్నం కోర్టులో హాజరుపర్చనున్నారు. మూడు రోజుల విచారణలో అఖిలప్రియ నుంచి కీలక ఆధారాలను రాబట్టినట్లుగా సమాచారం. సూత్రధారులైన భార్గవరామ్, గుంటూరు శ్రీనులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న హైదరాబాద్ పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. మహారాష్ట్రలో భార్గవరామ్, కర్ణాటకలో గుంటూరు శ్రీను ఉన్నట్లు కచ్చితమైన సమాచారం లభించడంతో ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ నెల 5న ప్రవీణ్రావు సోదరులను కిడ్నాప్ చేయించిన వీరిద్దరూ మొయినాబాద్లోని ఓ ఫామ్హౌస్కు తీసుకెళ్లి తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారని పోలీసులు అంటున్నారు. అనంతరం వారిని వదిలేసి వేర్వేరు మార్గాల్లో హైదరాబాద్ దాటి పారిపోయారని, కొన్ని గంటలపాటు భార్గవరామ్, గుంటూరు శ్రీనులు ఫోన్లలో మాట్లాడుకున్నాక పోలీసులకు దొరకకూడదని తమ సిమ్కార్డులను పారేశారని పోలీసు వర్గాల చెబుతున్నాయి. అయితే సాంకేతిక ఆధారాలతో వీరిద్దరూ కర్ణాటక, మహారాష్ట్రలలో ఉన్నారని పోలీసులు నిర్ధారించుకున్నారు.
కిడ్నాప్ వ్యవహారాన్ని ఆద్యంతం పర్యవేక్షించిన భార్గవరామ్, గుంటూరు శ్రీనులు ప్రవీణ్రావు సోదరులను అపహరించిన రోజు కారులో ఉన్నారా? ప్రవీణ్రావు ఇంట్లోకి వచ్చి అపహరించుకెళ్లారా? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. కిడ్నాప్ జరిగిన రోజు వారిద్దరూ ఒకే కారులో ఉన్నారని పోలీసులు గుర్తించారు. భార్గవరామ్, అఖిలప్రియలు ఉపయోగిస్తున్న కార్లు, కిడ్నాపర్లు వినియోగించిన కార్ల నంబర్ల ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కిడ్నాప్ ఉదంతం ముందు రోజు నిందితులు కూకట్పల్లి, బంజారాహిల్స్, పంజాగుట్ట, బేగంపేట ప్రాంతాల్లో ఒకే కారులో తిరిగారని పోలీసులు తెలుసుకున్నారు.
వీరిద్దరి కారు ప్రయాణ మార్గం ట్రాఫిక్ కూడళ్లలోని నాలుగైదు సీసీటీవీ ఫుటేజీల్లో నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో భార్గవరామ్ మాస్కు ధరించకపోవడంతో పోలీసులు సులభంగా గుర్తించారు. ప్రవీణ్రావు ఇంటికి వచ్చిన కార్లలో కాకుండా మరో కారులో భార్గవరామ్, గుంటూరు శ్రీనులు ఉన్నట్లు ఆధారాలున్నట్లుగా సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com