హైదరాబాద్‌ వాసులకు మరో బ్యాడ్ న్యూస్

హైదరాబాద్‌ వాసులకు మరో బ్యాడ్ న్యూస్
X
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతోన్న హైదరాబాద్‌ వాసులకు మరో బ్యాడ్ న్యూస్. గత కొద్ది రోజులుగా కంటిమీద కునుకు లేకుండా గడుపుతోన్న ప్రజలకు మరికొన్ని రోజులు ఇబ్బందులు..

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతోన్న హైదరాబాద్‌ వాసులకు మరో బ్యాడ్ న్యూస్. గత కొద్ది రోజులుగా కంటిమీద కునుకు లేకుండా గడుపుతోన్న ప్రజలకు మరికొన్ని రోజులు ఇబ్బందులు తప్పేలా లేవు. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని.. వర్షపాతం కూడా అత్యధిక స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వరుస అల్పపీడనాలు, వాయుగుండాలు, క్యుములో నింబస్‌ ప్రభావంతో గత కొద్ది రోజుల నుంచి నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండగా.. ఆ ఎఫెక్ట్‌ మరో మూడ్రోజులు తప్పదనేలా వాతావరణ శాఖ హెచ్చరికలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మరికొన్ని గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావం తెలంగాణపై ఉన్నా.. ఎక్కువగా హైదరాబాద్‌పై ఎఫెక్ట్‌ చూపిస్తుందని అంటున్నారు.. హైదరాబాద్‌కు మరోసారి వరుణ గండం ఉండడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా అప్రమత్తమయ్యారు.. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే చర్యలు మొదలు పెట్టారు.. ప్రజల్ని అప్రమత్తం చేసే పనిలో పడ్డారు.

హైదరాబాద్‌ నగర ప్రజలకు పలు సూచనలు చేశారు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్ కుమార్. 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే ప్రమాద ఉండటంతో ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న కుటుంబాలను ఖాళీ చేయించాలని జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సహాయ బృందాలు ఎంతటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇక నగరంలో వర్షాలు, వరద సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్‌, అధికారులు. వరద ప్రాంతాల్లో సాధారణ స్థితులు తెచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 330 మోటర్ల ద్వారా కాలనీలు, సెల్లార్లలో నిలిచిన నీటిని బయటకు పంపిస్తున్నారు. రోడ్లు, నాలాల్లోకి కొట్టుకువచ్చిన చెత్తాచెదారం, భవన నిర్మాణ, శిధిల వ్యర్ధాల తొలగించేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. అంటు వ్యాధుల నివారణకు వరద ప్రభావిత ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి, యాంటీ లార్వా, సోడియం హైపో క్లోరైట్ స్ప్రే చేస్తున్నారు.

అటు ఇప్పటికే కురిసిన వర్షాలతో హుస్సేన్‌సాగర్‌కు వరద పోటెత్తుతోంది. నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవల్ దాటింది. హుస్సేన్ సాగర్ కెపాసిటీ 513.410 మీటర్లు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం 513.840 మీటర్లుగా ఉంది. 2వేల 519 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతోంది. తూముల ద్వారా బయటకు 3వేల 093 క్యూసెక్కులు వదులుతున్నారు.

మరోవైపు నగరంలోని కొన్ని ప్రాంతాలు ఇంకా వరద గుప్పిట్లోనే బిక్కుబిక్కుమంటున్నాయి. మూసీ పరీవాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో మోకాలు లోతు నీళ్లు నిరంతరంగా ప్రవహిస్తూనే ఉన్నాయి. మూసీ నదికి ప్రవాహం పెరగడం, చెరువులు తెగడం కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఉదయమంతా ఎండ, పొడి వాతావరణం ఉన్నా సాయంత్రమైతే చిరు జల్లులతో మొదలై కుంభవృష్టి కురుస్తోంది. దీంతో మరోమారు వర్ష సూచనలతో నగరవాసి చిగురుటాకులా వణుకుతున్నాడు.

Tags

Next Story