Telangana Assembly:: హుక్కా పార్లర్ల నిషేధంపై బిల్లు..

Telangana Assembly:: హుక్కా పార్లర్ల నిషేధంపై బిల్లు..
సంబంధిత బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

రాష్ట్రంలో హుక్కా పార్లర్లపై నిషేధం విధించారు. ఈ మేరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సోమవారం హుక్కా పార్లర్ల నిషేధ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మంత్రి శ్రీధర్ బాబు సీఎం రేవంత్ రెడ్డి తరఫున బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. దీనిపై ఎలాంటి చర్చ లేకుండా ఏకగ్రీవంగా శాసనసభ బిల్లుకు ఆమోదం తెలిపింది. 'సిగరెట్ కంటే హుక్కా పొగ మరింత హానికరం. బొగ్గు ఉపయోగించడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది. దీన్ని సేవించిన వారికే కాకుండా వారి వల్ల చుట్టుపక్కల ఉండే వారికి కూడా ప్రమాదం. హుక్కా పార్లర్లపై నిషేధం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం ఈ బిల్లును ప్రవేశపెడుతున్నాం.' అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

హైదరాబాద్‌ నగరంలో తాజాగా హుక్కా పార్లర్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలకు చేసినప్పుడు.... గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలతో పాటు పొగాకు ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడే యువకుల్లో ఎక్కువ మంది హుక్కా కేంద్రాలకు వెళ్లేవారు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలోనే హుక్కా కేంద్రాలపై నిషేధం విధించాలని పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదికనిచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.


రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఎక్కువగా హుక్కా కేంద్రాలు నడుస్తున్నాయి. దాదాపు 500లకు పైనే నడుస్తున్నాయని పోలీసు అధికారులు అంచనా వేశారు. ఇవికాకుండా పబ్బులు, రెస్టారెంట్లు, హోటళ్లు, ఇళ్లల్లో గుట్టుగా కొనసాగేవి భారీగానే ఉన్నట్లు గుర్తించారు. ఈ కేంద్రాల్లో మద్యం పొగాకు ఉత్పత్తులతో పాటువ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసుల తనిఖీలతో తరచూ వెల్లడవుతోంది. నిబంధనల ప్రకారం హుక్కా పార్లర్ అనుమతి సమయంలో పేర్కొన్న నిర్దిష్ట గదుల్లోనే నిర్వహించాలి. పొగాకు ఉత్పత్తులు ఉపయోగించడానికి వీల్లేదు. మైనర్లను అనుమతించకూడదు. నిర్ణీత సమయాలు పాటించాల్సి ఉంటుంది.

నగరంలోని మెజార్టీ హుక్కా కేంద్రాల్లో నిబంధనలు ఏవీ పాటించడం లేదు. మైనర్లను అనుమతించడంతో పాటు విదేశీ సిగరెట్లు అమ్మేస్తున్నారు. కాఫీ క్లబ్బులు, రెస్టారెంట్లు, హోటళ్ల పైభాగంలో కొన్ని నడుస్తున్నాయి. పోలీసులు తనిఖీలకు వెళ్లినప్పుడు కోర్టు ఆర్డర్ ఉందంటూ సాకులు చెప్పడం, రాజకీయ, ఇతర పలుకుబడితో సర్దిచెప్పడం లాంటివి కొనసాగుతున్నాయి. అసాంఘిక కార్యాకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో గత కొన్నాళ్లుగా దృష్టిసారించిన పోలీసు అధికారులు... వీటిపై నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా హుక్కా కేంద్రాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. తాజా నిర్ణయం మాదకద్రవ్యాల నియంత్రణలో ముందడుగులాంటిదని, భవిష్యత్తులో ఎంతో మేలు చేస్తుందని అధికారులు భావిస్తున్నారు

Tags

Next Story