నా కేసు కొట్టేయండి..హైకోర్టులో బండి సంజయ్ క్వాష్ పిటిషన్
టెన్త్ పేపర్ లీక్ కేసులో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కమలాపూర్లో తనపై నమోదైన FIR కొట్టివేయాలని పిటిషన్లో తెలిపారు. దీంతో.. కమలాపూర్ స్కూల్ హెడ్మాస్టర్తో పాటు.. పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 16కు వాయిదా వేసింది.
పదోతరగతి హిందీ ప్రశ్నాపత్రాన్ని వాట్సప్లో లీక్ చేసిన కేసులో బండి సంజయ్ A1గా ఉన్నారు. క్వశ్చన్ పేపర్ ను ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్కు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. పేపర్ లీక్కు ముందు రోజు బండి సంజయ్, ప్రశాంత్ చాట్ చేసుకున్నారని.. ఈ చాట్ ఆధారంగానే బండి సంజయ్ ను A1గా చేర్చామని పోలీసులు తెలిపారు. ఇక బండి సంజయ్ పై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. తర్వాత ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. ఈ కేసులో బండి సంజయ్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com