బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్పై దాడి ఘటనలో పోలీసులకు బిగుస్తున్న ఉచ్చు
Bandi Sanjay (tv5news.in)
Bandi sanjay : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్పై దాడి ఘటనలో పోలీసులకు ఉచ్చు బిగుస్తోంది. బండి సంజయ్పై పోలీసుల దాడిని లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ తీవ్రంగా పరిగణించింది. సీఎస్ సోమేశ్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ గుప్తా, డీజీపి మహేందర్ రెడ్డి.. కరీంనగర్ సీపీ సత్యనారాయణ సహా బాధ్యులైన పోలీసు అధికారులకు సమన్లు జారీ చేసింది.
వీరితోపాటు హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకటరెడ్డి, జమ్మికుంట ఇన్స్పెక్టర్ కొమ్మినేని రాంచందర్రావు.. హుజూరాబాద్ ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాస్, కరీంనగర్ సీసీఎస్ ఏసీపీ కె. శ్రీనివాస రావు.. కరీంనగర్ ఇన్స్పెక్టర్ చలమల్ల నటేష్లకు కూడా ప్రివిలేజ్ కమిటీ సమన్లు జారీ చేసింది. వీరంతా ... ఫిబ్రవరి 3న ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ సునీల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
తనపై తన కార్యాలయంపై దాడి జరిగిన తీరుపై బండి సంజయ్ సమర్పించిన.. ఆధారాలను, వీడియో క్లిప్పింగులను ప్రివిలేజ్ కమిటీ పరిశీలించింది. ఎంపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి గ్యాస్ కట్టర్లతో, ఇనుప రాడ్లతో గేట్లను ధ్వంసం చేసి.. బండి సంజయ్ను అరెస్టు చేయడంపై సీరియస్ అయ్యింది. బండి సంజయ్ వాదనలు విన్న కొన్ని గంటల్లోనే.. లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది.
317 జీవోను సవరించాలని కోరుతూ జనవరి 2న కరీంనగర్ లో తన కార్యాలయంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ 'జాగరణ' చేస్తున్న ఎంపీ బండి సంజయ్ని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు పోలీసులు. దీనిపై ప్రివిలేట్ కమిటీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర హైకోర్టు సైతం తనపై దాడి, అరెస్టును తీవ్రంగా తప్పుపట్టిన విషయాన్ని బండి సంజయ్ ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. తనపై రెండోసారి దాడి జరిగిన విషయాన్ని చెప్పారు. దీంతో ఫిబ్రవరి 3న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది ప్రివిలేజ్ కమిటీ.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com