BJP Meeting: బండి సంజయ్ను భుజం తట్టి మెచ్చుకున్న ప్రధాని మోదీ..
BJP Meeting: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ HICCలో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లో విజయ సంకల్ప బహిరంగ సభ నిర్వహించారు. ఈ రెండు కార్యక్రమాలు సక్సెస్ కావడంతో జాతీయ నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వంలో జోష్ వచ్చింది. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సభకు ఊహించనంతగా జనం తరలివచ్చారు. సంస్థాగత బలమే గెలుపు మంత్రమని రాష్ట్ర నేతలకు ప్రధాని మోదీ సూచించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తొలిరోజ.. టీ, స్నాక్స్ సమయంలో తెలంగాణ నేతలతో కలిసి మాట్లాడారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో పాటు తదితరులు చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ను వెల్డన్ అంటూ వెన్ను తట్టి అభినందించారు మోదీ. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా తెలంగాణలో అనుసరించిన వ్యూహంపై మోదీ సంతోషం వ్యక్తం చేశారు. 119 నియోజకవర్గాలకూ పార్టీ సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జాతీయ పార్టీ నేతలు.. ఇలా అందరినీ పంపాలన్న ప్రణాళిక విజయవంతమైందని చెప్పారు. అటు.. జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లపైనా మోదీ హర్షం వ్యక్తం చేశారు.
బండి సంజయ్ను ప్రత్యేకంగా అభినందించారు. అటు.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన విజయ సంకల్ప సభ జనసంద్రమైంది. ఈ సభకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. కమలదండు కదిలివచ్చింది. తెలంగాణ నలుమూలల నుంచి తరలివచ్చిన జనంతో పరేడ్ గ్రౌండ్ ప్రాంతం కిటకిటలాడింది. అశేష జనవాహినిని చూసిన అగ్ర నేతలు ముఖాల్లో ఆనందం కనిపించింది. దీంతో మరోసారి అక్కడ కూడా బండి సంజయ్కు పార్టీ అగ్రనేతల నుంచి ప్రశంసలు లభించాయి. సభకు వచ్చిన జనాన్ని చూసిన మోదీ.. శభాష్ బండి సంజయ్ అంటూ భుజాన్ని తట్టి అభినందించారు.
ఇప్పటికే బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ దూసుకుపోతోంది. అధికార పార్టీకి గట్టి సవాల్ విసురుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్లకు దీటుగా బీజేపీని బండి సంజయ్ నడిపిస్తున్నారు. ప్రజాసంగ్రామ యాత్ర పేరిట ఆయన చేసిన పాద యాత్ర పార్టీకి ప్లస్ పాయింట్ అయ్యింది. దీన్ని ప్రధాని మోదీ గుర్తించి అప్పట్లో ఫోన్ చేసి ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడించేందుకు అధినాయకత్వం అందుకోసం మాస్టర్ ప్లాన్ రూపొందించింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, విజయ సంకల్ప సభతో పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ వచ్చింది. ఇక తమ సత్తా చూపిస్తామంటూ కమలనాథులు దూకుడు మీదున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com