సూర్యాపేటలో క్షుద్రపూజలు కలకలం

సూర్యాపేట జిల్లా కేంద్రంలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. శివారులోని అనేక ప్రాంతాల్లో రాత్రికి రాత్రే ఇళ్ల ముందు పిండి ముగ్గులు, పసుపు కుంకుమలు, పిండిబొమ్మలు వెలుస్తున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు తాంత్రిక పూజలు చేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ్నగర్, బాలాజీనగర్, కృష్ణ నగర్ కాలనీల్లోని జంక్షన్లలో జనసంచారం లేని సమయంలో ఈ క్షుద్రపూజలు చేస్తున్నారు. బాలాజీనగర్లోని ఓ ఇంటి ముందు విస్తరిలో పిండిబొమ్మ పెట్టి, పసుపు కుంకుమలు చల్లి పూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి.
ఇటీవలే ఆ ఇంటికి చెందిన యువకుడికి ప్రేమ విషయంలో ఓ అమ్మాయితో గొడవలు జరగడం.. ఆ తర్వాత రాత్రి పూట కొంతమంది అమ్మాయిలు స్కూటీపై ఆ ఏరియాలో సంచరించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో.. ఇది తెలిసిన వారి పనేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిజంగా క్షుద్రపూజలు జరిగాయా.. లేక బెదిరించడానికి ఇలా చేస్తున్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com