AP: బోరుగడ్డ అనిల్‍‌కు రాచమర్యాదలు.. పోలీసులపై వేటు

AP: బోరుగడ్డ అనిల్‍‌కు రాచమర్యాదలు.. పోలీసులపై వేటు
X

వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌కు రాచమర్యాదలు చేసిన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. అనిల్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఓ రెస్టారెంట్‌లో విందు భోజనం చేశారు. ఈ ఘటనను టీడీపీ కార్యకర్తలు సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరిస్తుండగా.. పోలీసులు ఫోన్ లాక్కుని వీడియో డిలీట్ చేశారట. దీనిపై సీరియస్ అయిన సర్కార్.. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసింది. బోరుగడ్డకు పోలీసులు విలాసవంతమైన రెస్టారెంట్‌లో దర్జాగా విందు భోజనం ఏర్పాటు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన డీజీపీ ఏడుగురు పోలీసులను సస్పెండ్‌ చేశారు. అనిల్‌పై తుళ్లూరు పోలీసుస్టేషన్‌ పరిధిలో గతంలో నమోదైన రెండు కేసులకు సంబంధించి పోలీసులు ఆయన్ను బుధవారం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి తీసుకొచ్చి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. మధ్యాహ్నం 2.30 గంటలకు రాజమహేంద్రవరానికి తిరుగు పయనమయ్యారు. అనిల్‌కు ఎస్కార్ట్‌ బృందంగా గుంటూరు జిల్లా ఏఆర్‌కు చెందిన ఆర్‌ఎస్సై పి.నారాయణరెడ్డి నేతృత్వంలో ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ కె.శ్రీనివాసరావు, ఏఆర్‌ కానిస్టేబుళ్లు టి.శంకరరావు, కె.బుచ్చయ్య, తుళ్లూరు పోలీసుస్టేషన్‌ కానిస్టేబుళ్లు బాల ఎం.శౌరి, నాగరాజు, తాడికొండ పీఎస్‌ కానిస్టేబుల్‌ ఎస్‌.ఏ.సద్దులా ఉన్నారు.

నిబంధనలు ఏం చెప్తున్నాయ్..

నిబంధనల ప్రకారం ఖైదీని వాహనంలోనే ఉంచి ఆహారం అందివ్వాలని నిబంధనలు చెప్తున్నాయి. పోలీసులు అనిల్‌కు రాచమర్యాదలు చేశారు. గన్నవరం సమీపంలోని ఓ రెస్టారెంట్‌ వద్ద వాహనాన్ని ఆపి, అనిల్‌ను అత్యంత గౌరవంగా లోపలికి తీసుకెళ్లారు. బిర్యానీలు, చికెన్, మటన్‌లతో భోజనం పెట్టించారు. అతనితో కలిసి సరదాగా విందు ఆరగించారు. అనిల్‌తోనే బిల్లు కట్టించారు. ఈ దృశ్యాల్ని తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరిస్తున్న వారిని బెదిరించి, డిలీట్‌ చేయించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవటంతో.. డీజీపీ ద్వారకా తిరుమలరావు తీవ్రంగా పరిగణించారు. అరగంట వ్యవధిలో సంబంధిత పోలీసులందర్నీ సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు. దీంతో వెంటనే గుంటూరు పోలీసులు చర్యలు చేపట్టారు.

జగన్ లో దందాలు

జగన్‌ పేరు చెప్పి బోరుగడ్డ అనిల్‌ గుంటూరులో దందాలు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. జగన్‌ పేరు చెప్పడం వల్ల పోలీసుల అతని వైపు కన్నెత్తి చూడలేదు. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి జగన్‌తో విబేధించి విమర్శలు చేయడంతో ఆయనను ఫోన్‌లో బెదిరించిన అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. అయినా పోలీసులు పట్టించుకోలేదు. బోరుగడ్డ అనిల్‌ నివాసం ఉండే బృందావన్‌ గార్డెన్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ కార్లలో వెళుతూ పెద్దపెద్దగా హారన్‌లు కొడుతూ అందరికీ నరకం చూపించారు. రూ. 50 లక్షలు ఇవ్వాలని 2021లో అనిల్‌కుమార్‌ తనను బెదిరించారని, ఇవ్వకపోతే చంపుతానని అన్నాడని కర్లపూడి బాబు ప్రకాష్‌ అనే వ్యక్తి అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినప్పటికీ వైసీపీ అధికారంలో ఉండటంతో అనిల్‌ను అరెస్ట్‌ చేయలేదు. ఇదేకాకుండా అరండల్‌పేట, పట్టాభిపురం, కొత్తపేట, పాత గుంటూరు, తాడికొండ, తుళ్లూరు పోలీస్‌ స్టేషన్లలోనూ అనిల్‌పై కేసులు ఉన్నాయి. అరండల్‌పేట పీఎస్​లో ఉన్న రౌడీషీట్‌ని పట్టాభిపురం ఠాణాకు బదిలీ చేశారు.

Tags

Next Story