Shanti Swaroop: శాంతి స్వరూప్ మృతిపై కేసీఆర్ సంతాపం

దూరదర్శన్ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ మృతిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. టీవీలో వార్తలను చదివే తొలితరం న్యూస్ రీడర్గా శాంతిస్వరూప్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారని కేసీఆర్ తెలిపారు. మీడియా రంగంలో ఆయన తనదైన ముద్ర వేశారని గుర్తు చేశారు. శాంతిస్వరూప్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురైన శాంతి స్వరూప్.. హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 1983 నవంబర్ 14న దూరదర్శన్ చానెల్లో శాంతి స్వరూప్ తెలుగులో తొలిసారి వార్తలు చదివారు. పదేండ్ల పాటు టెలీప్రాంప్టర్ లేకుండా పేపర్ చూసి వార్తలు ప్రజలకు వినిపించారు. తొలి తెలుగు న్యూస్ రీడర్గా చెరగని ముద్ర వేశారు. 2011లో పదవీ విరమణ చేసే వరకు శాంతి స్వరూప్ వార్తలు చదివారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. శాంతిస్వరూప్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శాంతిస్వరూప్ భార్య రోజారాణి కూడా టీవీ యాంకర్ గా పని చేశారు. కొంత కాలం క్రితమే ఆమె కన్నుమూశారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com