TG: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్

TG: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్
X
టీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్న భట్టి... ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలు

అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు నడిచాయి. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని భట్టి చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

నిజమని నిరూపించు.. కేటీఆర్‌కు భట్టి సవాల్

మాజీమంత్రి కేటీఆర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య అసెంబ్లీ వేదికగా వాగ్వాదం చోటు చేసుకుంది. పనులు కావాలంటే కాంగ్రెస్ నేతలకు 30 శాతం కమీషన్‌ చెల్లించాల్సిందేనంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము 30 శాతం కమీషన్లు తీసుకున్నట్టు నిరూపించాలని కేటీఆర్‌కు భట్టి సవాల్ విసిరారు. అలా నిరూపించలేని పక్షంలో సభకు క్షమాపణలు చెప్పాలని డిప్యూటీ సీఎం డిమాండ్ చేశారు. ధరణిపైనా భట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధరణి ఓ దుర్మార్గమైన చట్టమని... ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పామని గుర్తు చేశారు. ఎన్నికల ముందు చెప్పినట్లుగానే భూ భారతి తీసుకొచ్చామన్నారు. అలాగే, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాకే భూ భారతి తీసుకొచ్చినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పేర్కొన్నారు.

బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన

అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సచివాలయంలో కమీషన్లపై, కాంట్రాక్టర్ల ధర్నా గురించి కేటీఆర్‌ ప్రస్తావించారు. కేటీఆర్‌ వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క స్పందిస్తూ.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. భట్టి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనుచిత వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ సభ్యులు పట్టుబట్టారు. వద్దురా నాయనా 20 పర్సంట్‌ పాలన అంటూ.. అసెంబ్లీ ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం వద్ద నిరసన తెలిపారు. ఇది పర్సంటేజ్‌ల పాలన అంటూ నినాదాలు చేశారు.

భూ భారతి కాదు.. భూ హారతి: పల్లా

అసెంబ్లీలో భూ భారతి అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..' భూ భారతిపై కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తే.. మేము ధరణిపైనే ఎన్నికలకు వెళ్తాము. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది.. భూ భారతి కాదు భూ హారతి. జమా బంది పేరుతో కాంగ్రెస్ మరో దుకాణం తెరిచింది.' అని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.

Tags

Next Story