KTR: కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన కేసీఆర్

రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాని రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు నిధుల సమీకరణకు ఓ ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో ఆయన పోస్టు చేశారు. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన రూ.20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూములను.. ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలకు తనఖాపెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించాలని సర్కారు భావిస్తోందని ఆరోపించారు. దీనికి మధ్యవర్తిగా ఒక మర్చంట్ బ్యాంకర్ను పెట్టి వారికి రూ.100 కోట్ల కమీషన్ ఇచ్చేందుకు సిద్ధమైందని చెప్పారు. ఈ మతిలేని చర్య వల్ల తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటుపడుతందన్నారు. కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు రావని తెలిపారు.
రాష్ట్రంలో మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అన్నారు.. మొత్తానికి కాంగ్రెసోళ్లు వచ్చారు.. పెద్దమార్పే తెచ్చారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం హాస్టళ్లలో నెలకొన్న దుస్థితిపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. పదేండ్ల క్రితం నాటి కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో పురుగుల అన్నం, నీళ్ల చారు కనిపించేవి. నేటి కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో ఇంకా అధ్వాన్న పరిస్థితి ఏర్పడిందన్నారు. అల్పాహారంలో బల్లులు, చట్నీల్లో చిట్టెలుకలు దర్శనమిస్తున్నాయని మండిపడ్డారు.
మొన్న భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న విద్యార్థి జీవితం విషాదాంతంగా మారింది. నిన్న కోమటిపల్లి హాస్టల్లో ఉప్మాలో బల్లి పడడంతో 20 మంది విద్యార్థులు వాంతులతో ఆస్పత్రుల్లో చేరారు. సుల్తాన్పూర్ జేఎన్టీయూ హాస్టల్లో చట్నీలో చిట్టెలుక దర్శనంతో విద్యార్థులు బెంబేలెత్తారు. ఈ విషాహారం తింటే.. విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు…? అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు భరోసా ఎక్కడ..? అని కేటీఆర్ నిలదీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com