hydra: హైడ్రా కమిషనర్ రంగనాథ్పై కేసు

హైడ్రా కమిషనర్ రంగనాథ్పై జాతీయ మానవ హక్కుల కమిషన్లో కేసు నమోదైంది. కూకట్పల్లిలో బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకోగా, అధికారులు ఇళ్లు కూల్చేస్తారన్న భయంతోనే ఆమె సూసైడ్ చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు NHRCకి ఫిర్యాదు చేశారు. రంగనాథ్పై 16063/IN/224 కింద కేసు నమోదైందని... దర్యాప్తు చేస్తున్నట్లు NHRC తెలిపింది. బుచ్చమ్మ మరణానికి, హైడ్రాకు సంబంధం లేదని రంగనాథ్ ఇప్పటికే ప్రకటించారు.
ఏం జరిగిందంటే...?
కూకట్పల్లి ప్రాంతానికి చెందిన బుచ్చమ్మ అనే మహిళ శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. హైడ్రా కూల్చివేతల భయంతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. యాదవబస్తీలో నివాసముండే శివయ్య, బుచ్చమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బుచ్చమ్మ దంపతులది పాలవ్యాపారం. వీరు వివిధ ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేశారు. ఆడపిల్లలకు పెళ్లి చేసిన తర్వాత ఒక్కోక్కరికి ఒక్కో ప్లాట్ ఇచ్చారు. నల్ల చెరువు పరిసరాల్లోని వెంకట్రావునగర్, శేషాద్రినగర్లోని ఆ స్థలాల్లో ఇళ్లు కట్టించి అద్దెకు ఇచ్చారు. అయితే, నల్ల చెరువులోని ఆక్రమణలకు హైడ్రా అధికారులు ఇటీవల తొలగించారు. చెరువు పరిసరాల్లోని ఇతర నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చేస్తుందని ప్రచారం సాగుతోంది. దీంతో తమ ఇళ్లు ఎక్కడ కోల్పోతామోననే భయంతో బుచ్చమ్మ బలవన్మరణానికి పాల్పడింది. ఆ ఇళ్లను కూల్చివేస్తే తమ కూతుళ్లు ఇబ్బందులు పడతారని ఆమె మనోవేదనకు గురైంది.
హైదరాబాద్ను కాపాడేందుకే హైడ్రా చర్యలు: దాన కిషోర్
హైదరాబాద్ను ముంపు నుంచి కాపాడేందుకే హైడ్రా చర్యలు తీసుకుంటోందని మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ దానకిశోర్ స్పష్టం చేశారు. మూసీ బాధితులకు అండగా ఉంటామని.. ఎవ్వరికీ అన్యాయం జరగనివ్వబోమని వెల్లడించారు. గతంలో వరదలతో భారీ ప్రాణనష్టం సంభవించిందని.. చిన్న వర్షానికే సచివాలయం ముందు అంత వరద ఎన్నడూ చూడలేదన్నారు. మూసీని బ్యూటిఫికేషన్ చేయడం కోసం ఈ చర్యలు తీసుకోవడం లేదని తేల్చి చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com