ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న కేసులపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న కేసులపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

క్రిమినల్ కేసులు, ఇతర కేసులలో విచారణ ఎదుర్కుంటున్న ఎమ్మెల్యేలు, ఎంపీల కేసులపై ఇక రోజువారీ విచారణ చేపట్టాలని తెలంగాణా హైకోర్టు ఆదేశించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ, అవినీతి నిరోధక శాఖల కోర్టులకు కీలక ఆదేశాలు జారీ చేసింది తెలంగాణా హైకోర్టు. అదేవిధంగా ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులను విచారిస్తున్న ప్రత్యేక న్యాయస్థానాలకు కూడా హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా విచారణ వేగవంతం చేయాల్సిందేనని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

అదేవిధంగా నవంబర్ 6 వరకూ కోర్టులు అనుసరించాల్సిన అన్‌లాక్‌ విధానాన్ని హైకోర్టు ప్రకటించింది. ప్రస్తుత విధానంలోనే హైకోర్టులో విచారణలు కొనసాగించాలని నిర్ణయించింది. అలాగే జిల్లాలో కోర్టులు తెరచి భౌతిక విచారణ కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం నిర్ణయించింది.

హై కోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలతో కొందరి ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు తప్పవని కొందరు అంటున్నారు. ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనే అంశాల విషయంలో క్రిమినల్ కేసులు ఎదుర్కుంటున్నారు. వీరికి తాజాగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇబ్బందిగా మారాయని చెప్పవచ్చు.


Tags

Read MoreRead Less
Next Story