High Court: 'ఆ మాజీ ఎమ్మెల్యే భారతీయుడే కాదు'

High Court: ఆ మాజీ ఎమ్మెల్యే భారతీయుడే కాదు
X
జర్మనీ పౌరుడే.. తేల్చిచెప్పిన హైకోర్టు

మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కి తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. పౌరసత్వ వివాదంపై చెన్నమనేని వేసిన పిటిషన్‌కు హైకోర్టు కొట్టివేసింది. చెన్నమనేని రమేశ్‌ భారతీయుడు కాదని, జర్మన్ సిటిజన్ అని స్పష్టం చేసింది. రమేష్‌ జర్మనీ పౌరుడైనందున ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడని తీర్పు ఇవ్వాల్సిందిగా గతంలో ఆది శ్రీనివాస్‌ పిటిషన్ వేశారు. దీంతో 2023 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్‌ పోటీ చేయలేదు.

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నమనేని రమేష్ పిటిషన్ డిస్మిస్ చేసింది. పదిన్నర సంవత్సరాల పాటు హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి, ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించినట్లు కోర్టు తెలిపింది. రూ.30 లక్షల జరిమానా విధించింది. ఆది శ్రీనివాస్ కు రూ. 25 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మరో 5 లక్షలు హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని సూచించింది. నెల రోజుల్లో చెల్లింపులు పూర్తిచేయాలని రమేష్ కు హైకోర్టు ఆదేశించింది.

కాగా.. 2009లో సార్వత్రిక ఎన్నికల్లో వేములవాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా రమేష్‌బాబు పోటీ చేయగా ప్రత్యర్థిగా అది శ్రీనివాస్‌ బరిలో నిలిచారు. ఆది శ్రీనివాస్‌ పై స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఎన్నిక చెల్లదని తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పౌరసత్వం పొందారని ఆది శ్రీనివాస్‌ పై హైకోర్టును ఆశ్రయించారు. 2010 జూన్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రమేష్‌బాబు పోటీ చేసిన సందర్భంలోనూ అది శ్రీనివాస్‌ ఎన్నికల కమిషన్‌ను అశ్రయించారు. అప్పుడు ఎన్నికల కమిషన్‌షెడ్యూల్‌ను నిలిపివేసింది. హైకోర్టును బీఆర్‌ఎస్‌ పార్టీ ఆశ్రయించగా ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో ఎన్నికలు జరపాలని చెప్పింది. 2013లో రమేష్‌బాబు పౌరసత్వాన్ని శాసనసభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసింది. రమేష్‌బాబు సుప్రీం కోర్టును అశ్రయించి స్టే పొందారు. 2014 ఎన్నికల్లో మరోసారి రమేష్‌బాబు గెలుపొందారు. కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టు ఆదేశాలతో 2017లో రమేష్‌బాబు పౌరసత్వాన్ని రద్దు చేసింది. తాజాగా మళ్లీ హైకోర్టు ఈ తీర్పు వెలువరిచింది.

Tags

Next Story