Cheruvugattu Jatara 2024 : బ్రహ్మోత్సవాలకు చెర్వుగట్టు ముస్తాబు

Cheruvugattu Jatara 2024 : బ్రహ్మోత్సవాలకు చెర్వుగట్టు ముస్తాబు
నేటి నుంచి ఈనెల 21 వరకు జాతర

ప్రముఖ శైవ క్షేత్రమైన చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి ఈనెల 21 వరకు జరిగే జాతరకు జిల్లా అధికారులు, దేవాలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ గోపురాలు, చుట్టు పక్కల ఉన్న శివుడు, గణపతి విగ్రహాలకు రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దారు.

నల్గొండ జిల్లా చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు... సాయంత్రం 4 గంటలకు నల్గొండలోని రామాలయం నుంచి నగరోత్సవంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 17తేదీ ఉదయం 4 గంటలకు స్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 18న ఆదివారం స్వామి వారి అగ్నిగుండాలు, 19న దోపోత్సవం, అశ్వవాహన సేవ జరుపుతారు. 20న మహా పూర్ణావృతి, పుష్పోత్సవం, ఏకాంత సేవలు నిర్వహిస్తారు. 21న సాయంత్రం 4 గంటలకు గజ వాహనంపై చెర్వుగట్టు, ఎల్లారెడ్డిగూడెం గ్రామాల్లో గ్రామోత్సవం నిర్వహించి బ్రహ్మోత్సవాలను పరిపూర్ణం చేస్తారు.


పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంది. బ్రహ్మోత్సవాలకు సుమారు 3 లక్షల మంది వరకు భక్తులు రానున్నారని అంచనా వేశారు. ఇప్పటికే ఘాట్‌ రోడ్డు వద్ద, గుట్ట కింద రద్దీ ఉన్న ప్రదేశాల్లో దుకాణాలను తొలగించారు. పార్కింగ్‌ స్థలాన్ని ఏర్పాటు చేశారు. గుట్ట పైకి వృద్ధులు, చిన్న పిల్లలను తీసుకువెళ్లెందుకు ఆటోలను ఏర్పాటు చేశారు. CCTV కెమెరాల దృశ్యాలను చూసేందుకు 2 ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. నీటి వసతి, పారిశుధ్యం, మరుగుదొడ్లు, రవాణా తదితర వసతులపై ప్రత్యేక దృష్టి సారించారు.

జాతరకు వచ్చే భక్తుల కోసం నార్కట్‌పల్లి, నల్గొండ, యాదగిరిగుట్ట, సూర్యాపేట, దేవరకొండ, కోదాడ డిపోల నుంచి ప్రత్యేక బస్తులను నడుపనున్నారు. జాతర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నీటి వసతి, పారిశుధ్యం, మరుగుదొడ్లు, రవాణా తదితర వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులను అదేశించారు. స్వామి వారి కల్యాణం, తలంబ్రాల బియ్యం సేకరణలో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story