Christmas Celebrations: తెలుగు రాష్ట్రాలలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

Christmas Celebrations: తెలుగు రాష్ట్రాలలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
ఆనందంగా గడిపిన ప్రజలు

రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు అంబరన్నంటాయి. విద్యుద్దీప కాంతులు. క్రిస్మస్‌ ట్రీలతో ప్రార్థన మందిరాలు అందంగా అలంకించారు. పలు చర్చిల్లో క్రీస్తు జననాన్ని వివరించేలా బొమ్మలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. యేసు కీర్తనలు స్తూతిస్తూ.. క్రైస్తవులు కేక్ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు.

క్రిస్మస్‌ సందర్భంగా భాగ్యనగరం రంగురంగుల విద్యుత్ దీపాలతో కాంతులీనుతోంది. సికింద్రాబాద్‌లో సెయింట్‌ మేరీ చర్చిలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కీర్తనలు పాడుతూ యువతి, యువకులు ఆనందోత్సాహాంతో నృత్యాలు చేసి అలరించారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన క్రైస్తవులు.. ప్రభువు స్తుతిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. లక్డికాపుల్‌ చర్చిలో కీర్తనలతో.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పర్వదినాన్ని పురస్కరించుకొని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెస్లీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు దీవెనలతో ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అబిడ్స్‌లోని సెంటినరీ మెథడిస్ట్ చర్చి క్రిస్మస్‌ వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.


మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ప్రభువుకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హనుమకొండ జిల్లా కాజీపేటలోని ఫాతిమా చర్చిలో కేక్ కటింగ్ చేసి పండుగ జరుపుకున్నారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా..పలు జిల్లాలోని చర్చిలలో మంత్రులు పార్థనలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఖమ్మంలోని పలు చర్చిలో మంత్రులు పొంగులేటి, తుమ్మల ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రభువు దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. హనుమకొండ జిల్లాలోని కరుణాపురం చర్చి విద్యుత్ దీపాల అలంకరణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరులోని పలు చర్చిల్లో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు.


సిద్దిపేట జిల్లా CSI చర్చిలో జరిగిన వేడుకల్లో మాజీమంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. కేక్‌ కట్‌ చేసి క్రైస్తవులందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాలలో MLA ప్రేమ్ సాగర్‌రావుకు క్రైస్తవులు పూలమాల వేసి సన్మానించారు. చెన్నూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో యేసు చరిత్రపై ప్రదర్శనలతో వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు. నిజామాబాద్‌లో నూతనంగా నిర్మించిన చర్చికి పలువురు కుటుంబ సభ్యులతో వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంచిర్యాల జిల్లా సోముగూడెం కల్వరి చర్చిలోఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రత్యేక ప్రార్థనలు చేసి.. ఆశీస్సులు తీసుకున్నారు. దుబ్బాకలోని సంబరాల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొని.. యేసుక్రీస్తు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story