అమరవీరుల స్మాకర చిహ్నం చిరస్థాయిగా నిలుస్తుంది: కేసీఆర్

అమరవీరుల స్మాకర చిహ్నం చిరస్థాయిగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన అమరవీరుల అఖండ జ్యోతిని ప్రారంభించిన కేసీఆర్... తెలంగాణ అనుభవించని బాధ లేదన్నారు. 58 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో కూడా తమ అస్తిత్వాన్ని కోల్పోకుండా టీఎన్జీవోలు పనిచేశారన్నారు. ఎన్నో వేధింపులు, అవమానాలు ఎదుర్కొన్నారని కేసీఆర్ గుర్తు చేవారు. అన్ని స్థాయిల్లో విద్యార్థి శ్రేణులు అద్భుతంగా పనిచేశాయన్నారు. ఉద్యమసోయి బతికి ఉండాలని జయశంకర్ సార్ తపించారన్నారని గుర్తు చేశారు. ఇక తన మీద జరిగిన దాడి ప్రపంచంలో ఎవరిపైనా జరిగి ఉండదని.. ఆ తిట్లే దీవెనలు అనుకుని ముందుకు సాగామని కేసీఆర్ అన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిని వివరిస్తూ చేపట్టిన డ్రోన్ షో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది.. ఒకటి రెండు కాదు, 800 డ్రోన్లతో దాదాపు 20 నిమిషాలపాటు సాగిన డ్రోన్ షోను తిలకించి నగరవాసులు పులకించిపోయారు.. డ్రోన్ షో జరుగుతున్నంత సేపు సీఎం కేసీఆర్ అలా చూస్తుండిపోయారు.. తెలంగాణ చరిత్ర, చిహ్నాలను అత్యద్భుతంగా డ్రోన్లు చూపించాయి.
అంతకు ముందు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల స్తూపం వద్ద పోలీసుల గౌరవ వందనాన్ని సీఎం కేసీఆర్ స్వీకరించారు. అమరులకు నివాళిగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం అమరవీరుల స్మాకర చిహ్నాన్ని ప్రారంభించారు. మినీ థియేటర్లో తెలంగాణ ఉద్యమం, ప్రగతి ప్రస్థానంపై చిత్రీకరించిన లఘు చిత్రాన్ని మంత్రులు, అధికారులతో కలిసి సీఎం కేసీఆర్ తిలకించారు. మినీ థియేటర్లో లఘు చిత్రాన్ని తిలకించిన అనంతరం ప్రమిదపై తెలంగాణ అమరవీరులకు జోహార్ అనే సంక్షిప్త సందేశాన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ ఘనంగా సన్మానించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి కుటుంబాన్ని మొదట సన్మానించారు. ఈ సందర్భంలో అమరుల కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. సీఎం కేసీఆర్ వారందరినీ ఆప్యాయంగా పలకరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com