రేపు అమరవీరుల స్మారక కేంద్రాన్ని ప్రారంభించనున్న CM KCR

తెలంగాణ సాధన కలను సాకారం చేసుకునేందుకు ప్రాణార్పణ చేసిన వారి త్యాగాలు తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా అమరవీరుల స్మారక నిర్మాణం పూర్తయింది. వారి త్యాగాలే పునాదులుగా.. జ్ఞాపకాలే ఇటుకలుగా పేర్చుకుని రూపుదిద్దుకున్న ఈ కట్టడం ప్రారంభానికి సకల హంగులతో సిద్ధమైంది. 150 అడుగుల ఎత్తులో దేదీప్యమానంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. హైదరాబాద్ హుస్సేన్సాగర్ తీరాన ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ స్మారక కేంద్రాన్ని రేపు CM KCR ప్రారంభించనున్నారు.
తెలంగాణ సాధనలో అమరులైన వారి గుర్తుగా అమరవీరుల స్మారక కేంద్రం నిర్మించాలని CM KCR నిర్ణయించారు. 2017 జూన్లో శంకుస్థాపన చేశారు. తొలుత నక్షత్రం ఆకారంలో సుమారు 80 కోట్ల వ్యయంతో నిర్మించాలని భావించారు. అయితే ఎన్నో ఆకృతుల పరిశీలన అనంతరం ప్రజ్వలించే దీపం ఆకారంలో అద్దంలా మెరిసే స్టెయిన్లెస్ స్టీలుతో నిర్మించాలని నిర్ణయించారు. దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ను నిర్మించిన సంస్థతో సంప్రదింపులు జరిపి నిర్మాణాన్ని 178 కోట్లతో పూర్తిచేశారు. హుస్సేన్సాగర్ను ఆనుకునే ఈ ప్రాంగణం ఉండటం, పునాదులు తీసేకొద్దీ నీరు వస్తుండటంతో భవిష్యత్తులో ఎలాంటి కుంగుబాటుకు అవకాశం లేని విధంగా పునాదులు, బేస్మెంట్ల నిర్మాణంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. తెలంగాణ సాధన కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన వారి జ్ఞాపకంగా, సాంస్కృతిక కేంద్రంగా దాన్ని రూపొందించారు.
మొదటి రెండు బేస్మెంట్లలో 2.14 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని పార్కింగ్ కోసం కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్లో పుస్తక ప్రదర్శన, ఇతర ఎగ్జిబిషన్ల కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించారు. మొదటి అంతస్తులో అమరుల ఫొటో గ్యాలరీతోపాటు 70 మంది కూర్చునేందుకు వీలుగా థియేటర్ నిర్మించారు. రెండో అంతస్తులో 500 మంది కూర్చునేందుకు వీలుగా కన్వెన్షన్ సెంటర్ ఉంది. ఇక మూడో అంతస్తులో చుట్టూ అద్దాలతో, టెర్రస్పైన అద్దాల పైకప్పుతో రెస్టారెంటును ఏర్పాటు చేశారు. ఇక దీపం ఆకృతిలో రూపుదిద్దుకున్న నిర్మాణానికి ఎలాంటి అతుకులు కనిపించకుండా ప్రత్యేక స్టీలును ఉపయోగించారు. స్టీలును జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. దుబాయ్లోని గ్రాన్క్రాఫ్ట్ సంస్థ ఆ స్టీలును ఆకృతులుగా మలచి హైదరాబాద్కు తరలించగా క్రమబద్ధంగా అమర్చారు. పైన కన్పించే దీపం ఆకృతికే సుమారు వంద టన్నుల స్టీలును వినియోగించారు. దీపం ప్రజ్వలన ప్రాంత నిర్మాణానికి కార్బన్ స్టీలు వినియోగించారు. ఈ కారణంగా అది అద్దాలతో తీర్చిదిద్దినట్టుగా కనిపిస్తుంది. దీపపు కాంతి చూపరులను ఆకట్టుకునేలా కింది నుంచి ప్రత్యేక విద్యుత్తు కాంతులను ఏర్పాటుచేశారు.
పర్యాటకులు, అతిథులకు అతిథ్యమిచ్చేలా మూడో అంతస్తులో ఒకటి, టెర్రస్పై ఒకటి ఇలా రెండు రెస్టారెంట్లు సిద్ధంచేశారు. అందుకు అనుగుణంగా లోయర్ బేస్మెంట్లో కనీసం వెయ్యి మందికి భోజనాలు సిద్ధం చేసేందుకు కావాల్సిన స్థాయిలో వంటశాలకు అవసరమైన స్టౌలు, ఇతర పరికరాలు అమర్చారు. 800 లీటర్ల సామర్థ్యంతో కూడిన ఫ్రీజర్ను సిద్ధంచేశారు. మూడో అంతస్తులో మరో అత్యాధునిక వంటశాల ఉంది. ఈ అంతస్తులో వంటలు చేయటానికి గ్యాస్ స్టౌల స్థానంలో విద్యుత్తు ఆధారిత ఇండక్షన్ స్టౌలు ఏర్పాటుచేశారు. మూడో అంతస్తుకు అనుసంధానంగా ఏర్పాటుచేసిన రెస్టారెంటు చుట్టూ గ్లాసులు అమర్చిన కారణంగా అక్కణ్నుంచి నూతన సచివాలయం, ఇటీవల ఆవిష్కరించిన డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం, హుస్సేన్సాగర్ అందాలను ఆస్వాదించొచ్చు. ఇక తెలంగాణ సాధన ఎలా చరిత్ర సృష్టించిందో ఈ ప్రత్యేక మిర్రర్ ఇమేజ్ స్టీలు నిర్మాణం కూడా చరిత్రలో నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా ఇలా నిర్మించిన ఆకృతులన్నింటికంటే అమరవీరుల స్మారకమే అతి పెద్దది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com