REVANTH:ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని రేవంత్ ఆదేశించారు. తెలంగాణలో సేకరిస్తున్న ఇసుకలో 80 శాతం హైదరాబాద్లో వినియోగం అవుతున్న నేపథ్యంలో రాజధాని నగరం పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాను అరికట్టే కీలక బాధ్యతను ఐపీఎస్ రంగనాథ్ నేతృత్వంలోని హైడ్రాకు అప్పగించారు. ఇప్పటికే హైదరాబాద్లో చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణను అడ్డుకొనే బాధ్యతను హైడ్రా చేపట్టింది.
సమీక్ష నిర్వహించిన సీఎం
గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్.. తన నివాసంలో అధికారులతో సమీక్షించారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఉచిత ఇసుకకు చర్యలు
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పేదలు నిర్మించుకుంటున్న ఇళ్లకు ఉచిత ఇసుకను అందించడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అక్రమ రవాణాను అరికట్టి, పేదలు, సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇసుక రవాణా పర్యవేక్షణ కోసం ప్రత్యేకాధికారులను నియమించాలని చెప్పారు. ఇసుక బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎప్పుడూ ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు. ఇసుకను బ్లాక్ మార్కెట్కు తరలించే వారిని ఉపేక్షించవద్దని వారిపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. ఎక్కడెక్కడ ఇసుక రీచ్లు ఉన్నాయో అక్కడ తనిఖీలు చేపట్టాలన్నారు. తప్పు జరుగుతున్నట్టు అనుమానం ఉంటే వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది ప్రసక్తే ఉండకూడదని అధికారులకు ఫుల్ పవర్స్ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com