REVANTH: మేం ఓకే అంటే బీఆర్‌ఎస్ ఖాళీనే

REVANTH: మేం ఓకే అంటే బీఆర్‌ఎస్ ఖాళీనే
బీజేపీ-బీఆర్‌ఎస్‌ కలిసిపోయాయన్న రేవంత్‌రెడ్డి.... ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపాటు

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన అభయహస్తం ఆరు గ్యారంటీల్లో మరో హామీ అమలును తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించింది. భద్రాచలం ఆలయంలో సీతారాముల దర్శనం చేసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం... శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల గోడప్రతులు ఆవిష్కరించారు. తర్వాత భద్రాచలం మార్కెట్‌ యార్డుకు చేరుకుని అక్కడ నిర్వహించిన బహిరంగసభలో..... ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సహా ఇతర మంత్రులతో కలిసి ఇందిరమ్మ ఇంటి మోడల్‌ను ఆవిష్కరించారు. ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు న్యాయం జరుగుతుందన్న సీఎం... ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లేనని చెప్పారు. అందుకే ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరుతోనే ఇస్తున్నట్టు చెప్పారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్‌ పదేళ్లు మోసం చేశారని సీఎం ఆరోపించారు. పీఎం ఆవాస్‌ యోజన కింద పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ.. తెలంగాణలో ఇళ్లు ఎక్కడ కట్టారో చెప్పాలని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.


భద్రాద్రి రాముడిని కూడా కేసీఆర్ మోసం చేశారని, భద్రాద్రికి వంద కోట్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని మంత్రి పొంగులేటి విమర్శించారు. కాంగ్రెస్ గ్యారంటీలపై బీఆర్‌ఎస్‌ చేస్తున్న విమర్శలను భట్టి కొట్టిపారేశారు. భద్రాచలంలో గోదావరిపై రిటైనింగ్ వాల్‌ కోసం 500కోట్ల రూపాయలు మంజూరుచేసినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి తెలంగాణలో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ కోసం బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటనలో జాప్యం చేస్తున్నారన్న రేవంత్‌రెడ్డి.... మోదీ, కేసీఆర్‌ కలిసి కాంగ్రెస్‌పై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ మంచి చేస్తే చూడలేక బీఆర్‌ఎస్‌ శాపనార్థాలు పెడుతోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మణుగూరు వేదికగా కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించింది. ప్రజాదీవెన సభలో సీఎం, మంత్రులు పాల్గొని ప్రసంగించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గత భారాస ప్రభుత్వం నెరవేర్చలేదన్న సీఎం... కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నిస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్‌లో కేసీఆర్‌ కుటుంబసభ్యులు తప్ప ఎవరూ ఉండరన్న సీఎం... 14 ఎంపీ సీట్లను తాము గెలవబోతున్నామన్నారు. ప్రభుత్వంతో పెట్టుకోవద్దని హెచ్చరించిన సీఎం... అలా చేసిన వాళ్లెవరూ మిగల్లేదన్నారు.


తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చింది కార్యకర్తలేనన్న రేవంత్‌రెడ్డి...లక్షా 50 వేల మెజార్టీతో మహబూబాబాద్‌ ఎంపీ స్థానంలో కాంగ్రెస్‌ గెలవాలని ఆకాంక్షించారు. గత ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించలేదన్న మంత్రులు... ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు

Tags

Read MoreRead Less
Next Story