TG: డ్రగ్స్‌ కేసులో ఎవరున్న వదలొద్దు

TG: డ్రగ్స్‌ కేసులో ఎవరున్న వదలొద్దు
X
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు.... కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సందర్శించిన ముఖ్యమంత్రి

మాదకద్రవ్యాల కేసుల్లో సెలెబ్రిటీలున్నా.. ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. అవసరమైతే మాదకద్రవ్యాల నిరోధక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్‌ మహానగరానికి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలన్నారు. ఇందుకు సంబంధించి జూన్‌ 4లోగా ప్రణాళికను సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తొలిసారి రాష్ట్ర ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సందర్శించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తాతో కలిసి పోలీస్, జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌, వాతావరణ తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో తీసుకుంటున్న చర్యలు, పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని..... ఈ విషయంలో ప్రస్తుతం జరుగుతున్న పనితీరుకన్నా మరింత క్రియాశీలంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. అనుమానిత ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని.... సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. డ్రగ్స్‌ సరఫరా వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలని.... సరఫరా చేయాలంటేనే భయపడేలా కఠినంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. ఉక్కుపాదం మోపేందుకు ఏం కావాలన్నా ప్రభుత్వం సమకూరుస్తుందని.... మాదకద్రవ్యాలు అనే పదం వింటేనే వణికిపోయేలా చర్యలుండాలన్నారు. ఈ క్రమంలో ప్రతిభ కనబరిచే వారిని ప్రోత్సహించాలని తెలిపారు. తెలంగాణను డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని.... తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌ మహానగరానికి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇందుకు సంబంధించి జూన్‌ 4లోగా ప్రణాళికను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. అవుటర్‌ రింగ్‌రోడ్‌ లోపల ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని తెలిపారు. 365 రోజులు పనిచేసేలా ఈ వ్యవస్థ ఉండాలని... ఒక్కో ప్రభుత్వ విభాగం నుంచి ఒక్కో అధికారి బాధ్యత వహించాలని దిశానిర్దేశం చేశారు. నాలాల పూడికతీతలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని.... తీసిన పూడికను.. క్వారీ ఏరియాలకు తరలించాలని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని... పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఓపెన్‌ సెల్లార్‌ గుంతల వద్ద ముందుజాగ్రత్తగా బారికేడింగ్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని... అలాంటి ప్రాంతాల్లో ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. హైదరాబాద్‌ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. కంటోన్మెంట్‌ ప్రాంతంలో నాలాల సమస్యలు తలెత్తకుండా యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించాలని తెలిపారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని.... పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని సీఎం హెచ్చరించారు. పనిచేసే వారిని ప్రోత్సహించి ఉన్నత స్థానాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

Tags

Next Story