REVANTH: త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌

REVANTH: త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌
X
స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.... డిసెంబర్‌ 9లోగా నియామకాలు పూర్తి చేస్తామన్న సీఎం

త్వరలో జరగనున్న శాసనసభ సమావేశాల్లోనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రతీ ఏడాది మార్చిలోగా అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలు సేకరించి జూన్‌ 2లోగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేస్తామని రేవంత్‌ తెలిపారు. డిసెంబరు 9లోగా నియామకాలు పూర్తి చేస్తామని నిరుద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 2023లో తెలంగాణ నుంచి సివిల్స్‌కు ఎంపికైన 35 మందిని, ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికైన ఆరుగురిని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.

ఈ ఏడాది సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఉత్తీర్ణులకు సింగరేణి సంస్థ తరపున రూ.లక్ష చొప్పున సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, సింగరేణి సీఎండీ బలరాం పాల్గొన్నారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని రేవంత్‌ అన్నారు. గత పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందన్నారు. నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేశామని రేవంత్‌ అన్నారు. పకడ్బందీ ప్రణాళికతో పరీక్షలు సమర్థంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఉత్తీర్ణులకు ఆర్థిక సాయం అందిస్తున్న సింగరేణికి అభినందనలు తెలిపారు. సివిల్స్‌లో తెలంగాణ జెండా ఎగరేసి జాతీయ స్థాయిలో సత్తా చాటాలి. ప్రిలిమ్స్‌ విజేతలు మెయిన్స్‌ కోచింగ్‌ కోసం అవసరమైన స్టడీ మెటీరియల్‌ కోసం, హాస్టల్‌ ఖర్చులు, మెరుగైన శిక్షణ కోసం ఉపయోగపడేలా రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామని తెలిపారు.

కేంద్ర బడ్జెట్‌పై భారీ ఆశలు

పార్లమెంటులో ఈనెల 23న మోదీ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌పై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ప్రాజెక్టులతోపాటు కొత్తగా మరికొన్నింటికి సైతం నిధులు ఇవ్వాలని ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈసారైనా నిధులు ఆశించిన స్థాయిలో దక్కుతాయని ఎదురుచూస్తోంది. కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులకు అనుగుణంగానే రాష్ట్ర బడ్జెట్‌ను ఖరారు చేయాలని ఇప్పటికే తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. మూడేళ్లుగా కేంద్రం నుంచి గ్రాంట్ల పద్దు కింద పూర్తిస్థాయిలో నిధులు రాక తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఇటీవల ప్రధాని మోదీకి కూడా రేవంత్‌రెడ్డి విన్నవించారు.

Tags

Next Story