REVANTH: సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్లోని సత్య నాదెళ్ల నివాసానికి వెళ్లిన సీఎం ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీఎం వెంట సీఎస్ శాంతికుమారి, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కీలకపాత్ర పోషించాలని సీఎం కోరారు. ఓపెన్ ఏఐ నుంచి ఉచిత క్రెడిట్స్ ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో తెలంగాణలో నాలుగు డేటా సెంటర్లు, హైదరాబాద్ కేంద్రం విస్తరణపై కూడా చర్చ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండాలనే తమ నిబద్ధతను కొనసాగిస్తామని సత్య నాదెళ్ల తెలిపారు. భవిష్యత్ అవసరాలకు తగినట్లు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే విషయంలో సీఎం దార్శనికతను సత్య నాదెళ్ల ప్రశంసించారు.
ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ ప్రతిపాదనల చర్చ
స్కిల్ యూనివర్సిటీ, ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్పై వారి మధ్య చర్చ జరిగింది. స్కిల్ యూనివర్సిటీలో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంపై సత్య నాదెళ్లతో చర్చించారు. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ ప్రతిపాదనలపై చర్చించారు. అలాగే ఏఐ సిటీలో ఆర్ అండ్ డీ ఏర్పాటుకు సహకారంపై కూడా చర్చ జరిగింది. క్లౌడ్ కంప్యూటింగ్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుపై చర్చ జరిగింది.
స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్ లో 4,000 ఉద్యోగాలు ఇవ్వడంపై ఇటీవల మైక్రోసాఫ్ట్ తో జరిగిన ఒప్పందం గురించి కూడా ఇరువురు ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ఫోర్త్ సిటీ అభివృద్ధిపైనా సీఎం రేవంత్ రెడ్డి... మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో చర్చించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com