CONGRESS: సిద్ధమవుతున్న రేసు గుర్రాల లిస్ట్‌ !

CONGRESS: సిద్ధమవుతున్న రేసు గుర్రాల లిస్ట్‌ !
X
తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికపై ఈనెల 20న భేటీ.... 50 మందితో తొలి జాబితా?

తెలంగాణలో అసెంబ్లీ బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లోనే తొలి జాబితా విడుదల చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ప్రతి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలనుకున్న నేతల నుంచి కాంగ్రెస్‌ పార్టీ దరఖాస్తులు ఆహ్వానించింది. అభ్యర్ధుల ఎంపికపై ఈనెల 20న మరోసారి కాంగ్రెస్‌ స్కీనింగ్‌ కమిటీ సమావేశం కానుంది. స్క్రీనింగ్‌ కమిటీ నివేదిక ఆధారంగా కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ 50కి పైగా నియోజక వర్గాలకు అభ్యర్ధులను మొదటి జాబితాలో ప్రకటించే అవకాశం ఉందని TPCC భావిస్తోంది. 35 నియోజకవర్గాల్లో ఒకే పేరుతో, 40 నియోజవర్గాల్లో రెండు పేర్లతో మిగిలిన చోట్ల మూడు, నాలుగు పేర్లతో అభ్యర్థుల జాబితాను తెలంగాణ ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ స్క్రీనింగ్‌ కమిటీకి నివేదించినట్లు సమాచారం.

తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్ధులుగా ఎన్నికల బరిలో దిగేందుకు టికెట్ల కోసం దరఖాస్తులు చేసిన 1006 మంది ఆశావహులను వడపోత పోసిన TPCC 200 నుంచి 300 వరకు పేర్లతో కూడిన జాబితాను స్క్రీనింగ్‌ కమిటీకి నివేదించింది. 29 మంది సభ్యులు వడపోతలో పాల్గొని 550 పేజీల జాబితా పుస్తకంలో నియోజకవర్గాల వారీగా బలమైన నేతలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 6నజరిగిన స్క్రీనింగ్‌ కమిటీ సమావేశంలో దేశ్‌ ఎన్నికల కమిటీ నివేదించిన జాబితా అందించినా కేవలం విధివిధానాలపై మాత్రమే చర్చించారు. మరోసారి సమావేశమై నియోజకవర్గాల వారీగా వచ్చిన పేర్లను పరిశీలించి బలమైన అభ్యర్థులతో స్క్రీనింగ్‌ కమిటీ ఓ జాబితా సిద్ధం చేసి CECకి నివేదించనుంది.


35కుపైగా నియోజకవర్గాల్లో ఒకే పేరు ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. మరో 40చోట్ల రెండు పేర్లతో PEC సభ్యులు ప్రతిపాదించినట్లు సమాచారం. మిగిలిన నియోజకవర్గాలకు మూడు పేర్లతో ప్రతిపాదనలు ఉండగా నాలుగు పేర్లతో ప్రతిపాదనలు చాలా తక్కువగా ఉన్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి. తొలుత ఈనెల18 లేదా 19న సమావేశం నిర్వహించాలని స్క్రీనింగ్‌ కమిటీ నిర్ణయించింది. ఐతే ఆ రెండు తేదీలు సాధ్యం కాదని అంచనా వేసుకున్న కమిటీ... ఈ నెల 20న సమావేశం కావాలని నిర్ణయించింది. ఆ సమావేశం తర్వాత కొన్నింటిని ఎంపిక చేసి కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదిస్తారు. యాభైకిపైగా నియోజక వర్గాలకు కాంగ్రెస్‌ కేంద్ర కమిటీ తొలి జాబితాలోనే అభ్యర్ధుల్ని ప్రకటిస్తుందని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags

Next Story