KCR: కేసీఆర్ నివాసానికి మరోసారి వచ్చిన పోలీసులు
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి **కేసీఆర్**కు చెందిన నంది నగర్ నివాసానికి తెలంగాణ పోలీసులు మరోసారి వెళ్లారు. రేపు జరగనున్న విచారణ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు అధికారులు అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చకు దారితీసింది.వివరాల ప్రకారం, కేసీఆర్ నివాస పరిసరాల్లోని భద్రతా పరిస్థితిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. విచారణ ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై తుది నిర్ణయాన్ని కేసీఆర్కే వదిలివేయగా, ఆయన నుంచి వచ్చే సమాచారం ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. విచారణకు అనుకూలమైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛను సిట్ ఇప్పటికే ఆయనకు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఒకవేళ కేసీఆర్ తన నివాసంలోనే విచారణకు అంగీకరిస్తే, భారీ భద్రతా బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవసరమైన పోలీసు బలగాలు, ట్రాఫిక్ నియంత్రణ, పరిసర ప్రాంతాల భద్రత వంటి అంశాలపై ముందస్తు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. నివాసానికి వచ్చే మార్గాలు, మీడియా కవరేజ్, ప్రజల కదలికలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా కేసీఆర్కు నోటీసులు జారీ కావడంతో, ఆయన విచారణ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
