ED CASE: రాణా, విజయ్ దేవరకొండపై ఈడీ కేసు

బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపై ఈడీ దూకుడు పెంచింది. మియాపూర్కు చెందిన వ్యాపారవేత్త పి.ఎం. ఫణీంద్ర శర్మ ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ల్లో సెలబ్రిటీలు, ఇన్ఫ్లూయెన్సర్లు.. అక్రమ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారని ఫణీంద్ర శర్మ తన కంప్లైంట్లో పేర్కొన్నారు. ఈ యాప్ల ద్వారా వేల కోట్ల రూపాయిలు చలామణి అవుతున్నాయని.. దీనివల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక నష్టాల్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ యాప్స్ ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపించి ప్రజలను బెట్టింగ్స్కు బానిసలన్ని చేస్తున్నారన్నారు. దీంతో హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసి సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లూయెన్సర్లపై పీఎంఎల్ఏ కింద విచారించనున్నారు. బీఎన్ఎస్లోని 318(4), 112, రెడ్విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్లోని 3, 3(ఎ), 4 సెక్షన్లు, ఐటీ చట్టం 2000, 2008లోని 66డి సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ యాప్స్ ప్రమోషన్ కోసం భారీగా కమీషన్, పారితోషికం తీసుకున్నారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యాప్ల కారణంగా అప్పులపాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకోగా, చాలా కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొందని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.ఈడీ మెుత్తం 29 మంది సినీ ప్రముఖులతో పాటు.. వివిధ కంపెలపైనా కేసు నమోదు చేసింది. కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న ఈడీ ఒక్కసారిగా కేసు నమోదు చేయడంతో ఇప్పుడు టాలీవుడ్ లో సరికొత్త కలకలం ఆరంభమైంది. దీనిపై ఎవ్వరూ అధికారికంగా స్పందించలేదు.
సెలబ్రెటీలపై ఈడీ దూకుడు
కేసు నమోదైన వారిలో.. ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, విజయదేవర కొండ, శ్రీముఖి, రానా, మంచు లక్ష్మీ, అనన్యా నాగళ్ల, సిరి హనుమంతు, వర్షిణి సౌందరాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణు ప్రియ, హర్ష సాయి, సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, బండారు శేషయాని సుప్రీతలు ఉన్నారు. వీరిలో కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు కూడా ఉన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేశారు. గతంలో వీరిపై సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తును చేపట్టింది. అయితే యాప్ ప్రమోషన్కు సంబంధించి ఐటీ రిటర్న్లో లెక్కలు చూపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది. తెలంగాణ గేమింగ్ చట్టం, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయగా.. ఇప్పుడు ఈడీ దర్యాప్తుతో ఈ కేసు బలంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com