Editorial: "గంప గోవర్ధన్ సీటు గల్లంతేనా?"

Editorial: గంప గోవర్ధన్ సీటు గల్లంతేనా?
కామారెడ్డి కారు పార్టీలో కోల్డ్ వార్; అధికారపార్టీలో ముచ్చటగా 3 గ్రూపులు; ఎమ్మెల్యే సీటుకు చెక్ పెడుతూ వ్యూహాలు; ఆశావహులతో సిట్టింగులో అలజడులు; గంపకు గట్టిగానే మాస్టర్ ప్లాన్ దెబ్బ; కుడితిలో పడ్డ ఎలుకలా ఎమ్మెల్యే పరిస్థితి


కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 7 సార్లు గెలిచింది. 5 సార్లు టీడీపీ, 3 సార్లు బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ప్రాంతానికి ఎంతో రాజకీయ చైతన్యం ఉంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను శాసిస్తారు ఇక్కడి రైతులు. గతంలో నల్ల బెల్లంపై ఆంక్షల విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఇక్కడి చెరుకు రైతులు ఎన్నికల్లో ప్రభావం చూపారు.అయితే వరుస విజయాలతో దూసుకుపోతున్న గులాబీ పార్టీకి ఈ సారి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మాస్టర్ ప్లాన్ వివాదం ఆ పార్టీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ను ఇరకాటంలో పడేసింది. రైతుల ఉద్యమంతో తప్పులు సరి దిద్దుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు అంతగా ప్రభావం చూపలేదట. రైతుల పోరాటంతో పట్టు వీడి దిగిరాక తప్పలేదు. మాస్టర్ ప్లాన్ వివాదం ఇప్పుడు అధికార పార్టీలో తలో దారికి కారణం అవుతోందట.

ఎన్ని కలు సమీపిస్తుండటంతో ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు అన్ని ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో సొంత పార్టీ నేతలు కూడా ఎమ్మెల్యే గంపకు కుంపటి పెట్టె పనిలో ఉన్నారట. ఒంటెద్దు పోకడలతో వివాదానికి కారణం అయ్యారని, పార్టీకి బాగా డ్యామేజ్ అయ్యిందని కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారట. పూడ్చుకోలేని నష్టం జరిగిందని మండిపుడుతున్నారట. మాస్టర్ ప్లాన్ రద్దు చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అనే వాదన కూడా గులాబీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తోందట. వరుసగా 3 సార్లు గెలిచి వ్యతిరేకత మూటగట్టుకున్న గంపకు ఈసారి చెక్ పెట్టేందుకు తెరవెనుక వ్యూహ రచన చేస్తున్నారట. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ముజీబ్, ప్రధాన అనుచరుడు నిట్టు వేణుగోపాల్, మాజీ ఎంపీపీ నర్సింగ్ రావులు ఎమ్మెల్యేకు మేకులా మారారట. వచ్చే ఎన్నికల్లో టిక్కెటే లక్ష్యంగా పావులు కదుపుతున్నారట.

అడుగుముందుకేసిన ముజీబ్.. మైనార్టీ కోటాలో ఈ సారి టికెట్ తనకే అంటున్నారట.ఈ మేరకు పార్టీ పెద్దలు కేటీఆర్, కవితలకు దగ్గరయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే దృష్టిలో పడకుండా జాగ్రత్త పడుతూ వీరితో టచ్ లో ఉంటున్నారట. ఒకవేళ సిట్టింగ్ ను మార్చాల్సి వస్తే మొదటగా తన పేరే పరిశీలనకు వస్తుందనే ధీమా లో ఉన్నారట ఈ మైనార్టీ నేత. మరో వైపు ఎమ్మెల్యే ప్రధాన అనుచరుల్లో ఒకరైన నిట్టు వేణుగోపాల్ కూడా నేను సైతం అంటున్నారట. 2012 లో గంప గోవర్ధన్ టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన సమయంలో జరిగిన ఉపఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థిగా నిట్టు వేణు పోటీ చేశారు. ఆ తరువాత గులాబీ పార్టీలో చేరిపోయారు. గత మున్సిపల్ ఎన్నికల్లో తన కూతురు జాహ్నవిని మున్సిపల్ ఛైర్ పర్సన్ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. తనకున్న పాత పరిచయాలు, పలుకుబడిని ఉపయోగించి ఎలాగైనా టిక్కెట్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారట నిట్టు వేణు. కామారెడ్డి బల్దియాలో కూతురును ఛైర్ పర్సన్ చేయడంలో సఫలీకృతం కాగా ఆ పదవిని పూర్తి స్థాయిలో వాడుకుంటూ నియోజకవర్గంపై పట్టు సాదించేదిశగా పావులు కదుపుతున్నారట. తనకంటూ ఓ వర్గాన్ని కూడగట్టే పనిలో ఉన్నారట.

అయితే ఇటీవల మాస్టర్ ప్లాన్ వివాదాన్ని ఎమ్మెల్యేపై నెట్టేసే కుట్ర జరిగిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు దీన్ని అవకాశంగా తీసుకుని వచ్చే ఎన్నికల్లో గంపకు చెక్ పెట్టాలని చూస్తున్నారట. ఇదే జరిగితే తనకు లైన్ క్లియర్ అవుతుందని భావిస్తున్నారట. అయితే గంప మాత్రం మాస్టర్ ప్లాన్ వివాదంలోంచి బయట పడేందుకు పూర్తిగా మున్సి పాలిటీపై నెట్టేసి తప్పించు కునేందుకు ప్రయత్నిస్తున్నా రట.అందుకే ఆరోగ్య సమస్యల సాకుతో కౌన్సిల్ సమావేశానికి కూడా దూరంగా ఉన్నారని నిట్టు వర్గం అంటోంది. మాస్టర్ ప్లాన్ పాపం మున్సిపాలిటీదే తనకేమీ తెలియదు అని ప్రజల్లోకి తీసుకెల్లే ప్రయత్నం చేశారట ఎమ్మెల్యే. ఇదిలా ఉంటే... అటు గంప, ఇటు నిట్టు... నువ్వానేనా అన్నట్లుగా తెర వెనుక రాజకీయాలు చేస్తుంటే.. ఈ ఇద్దరికి బదులు తనకు అవకాశం రాకపోతుందా అని ఎదురు చూస్తున్నారట మైనారిటీ నేత ముజీబ్. ఆ ఇద్దరు నేతల కదలికలను ఎప్పటికప్పడు అధిష్టానానికి చేరవేస్తూ పార్టీ పెద్దలకు దగ్గరయ్యే పనిలో ఉన్నారట ఈ నేత.

మొత్తంగా ముగ్గురి మధ్య ముడిపడదు అన్నట్లుగా కామారెడ్డి అధికారపార్టీలో ఎన్నికలకు ముందే కోల్డ్ వార్ నడుస్తోందట.ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా నడుచుకోవడంతో ఏ గ్రూప్ తో జతకట్టాలో తెలియక క్యాడర్ అయోమయంలో ఉందట. ఎన్నికల నాటికి ఈ కోల్డ్ వార్ ఎటువైపు దారితీస్తుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story