Education : ఆరేళ్లు నిండితేనే ఒకటో తరగతి

ఒకటో తరగతిలో చేరాలంటే ఇక.... ఆరేళ్లు పూర్తి అవ్వాల్సిందే! నూతన విద్యావిధానంలో భాగంగా... అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు.. కేంద్రం లేఖ రాసింది. చిన్నారుల పునాది దశ, విద్యాభ్యాసాన్ని బలోపేతం చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ విద్యావిధానం-2020 సిఫార్సు చేసింది. పునాది దశలో విద్యార్థులకు అయిదేళ్లపాటు అభ్యాస అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. అందులో 3 ఏళ్లు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, 2 ఏళ్లు ప్రాథమిక విద్యలో తొలిదశ అయిన 1, 2వ తరగతులు ఉంటాయి. ప్రీ స్కూల్ నుంచి 2వ తరగతి వరకు పిల్లలకు ఎలాంటి అవాంతరాలు లేని అభ్యాస పద్ధతిని ప్రోత్సహించాలన్నది ఈ విధానం ముఖ్య ఉద్దేశం.
ప్రీ స్కూల్ కేంద్రాల్లో మూడేళ్లపాటు పిల్లలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుందని తెలిపింది. ఈ లక్ష్యం సాకారం కోసం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఒకటో తరగతిలోకి ఆరేళ్లు నిండిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పించాలని ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా ప్రవేశ ప్రక్రియ నిబంధనల్లో సవరణలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో ప్రీ స్కూల్ విద్యార్థులకు బోధించేలా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్లో రెండేళ్ల డిప్లొమా కోర్సును రూపొందించి అమలుచేయాలని తెలిపింది. ఈ కోర్సును NCERT ద్వారా రూపొందించి, DIETల ద్వారా అమలు చేయాలని తెలిపింది. ఎస్సీఈఆర్టీ పర్యవేక్షణలోనే నిర్వహించాలని సూచిచంింది కేంద్ర విద్యాశాఖ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com