TG: స్ట్రాంగ్‌ రూంల వద్ద మూడంచెల భద్రత

TG: స్ట్రాంగ్‌ రూంల వద్ద మూడంచెల భద్రత
సీసీ కెమెరాల నీడలో స్ట్రాంగ్‌ రూంలు... అభ్యర్థులతో పాటు ప్రజల్లోనూ ఉత్కంఠ

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగియడంతో ఎన్నికల సామగ్రిని అధికారులు స్ట్రాంగ్‌ రూములకు తరలించారు. రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధుల మధ్య EVMలు, VV-ప్యాట్‌లకు సీళ్లు వేసిన అధికారులు... మూడంచెలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు వరకు CC కెమెరాల నిఘా నీడలోనే ఉంచనున్నారు. 17MP స్థానాల్లోని అభ్యర్థుల భవితవ్యంపై ఓటర్లు తీర్పునిచ్చారు. EVMలు, VV-ప్యాట్‌లను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించిన అధికారులు....పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో 48.5 శాతం పోలింగ్‌ నమోదైందని కలెక్టర్‌ అనుదీప్‌ వెల్లడించారు. గతంతో పోలిస్తే..6శాతం ఓటింగ్‌ పెరిగిందన్న..అనుదీప్‌ రానున్న ఎన్నికల్లో మరింత పెరిగే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఓట్లు డిలీట్‌ అయ్యాయన్న ఆరోపణలను ఖండించిన కలెక్టర్‌...పద్ధతి ప్రకారమే ఓట్లు తొలగించామని తెలిపారు.


రంగారెడ్డి జిల్లా చెవేళ్ల నియోజకవర్గ పరిధిలోని EVMలను గొల్లపల్లిలోని బండారి శ్రీనివాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలలో భద్రపరిచారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో పోలింగ్‌ శాతం గతం కంటే పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల సామగ్రిని నర్సాపూర్‌లోని B.V.R.I.T కళాశాల, గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచారు. కరీంనగర్‌ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలోని EVMలను GPS అమర్చిన వాహనాల ద్వారా SR కళాశాలకు తరలించారు. పెద్దపల్లి పరిధిలో ఉపయోగించిన ఎన్నికల సామగ్రిని మంథనిలోని JNTU కళాశాలతో పాటు మంచిర్యాలలోని మరో కళాశాలకు తరలించారు. పెద్దపల్లి కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌, సిరిసిల్ల కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి EVMల వెరిఫికేషన్‌ను స్వయంగా పరిశీలించారు.

నల్గొండ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన EVMలను దుప్పలపల్లి గోదాములో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచారు. గోదాముల వద్దనున్న CC కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేశారు. భువనగిరి నియోజకవర్గంలో వినియోగించిన EVMలను అరోరా ఇంజినీరింగ్‌ కళాశాలకు తరలించారు. స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలించిన కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్ కుమార్‌ రెడ్డి... EVMలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా ఏడంచెల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండగా చివరి దశ ముగిసిన అనంతరం జూన్‌ 4న చేపట్టే ఓట్ల లెక్కింపులో అభ్యర్థులు భవితవ్యం తేలనుంది.

Tags

Next Story