FARMER: త్వరలోనే ఆదర్శ రైతులు ఎంపిక: కోదండరెడ్డి

తెలంగాణలో విత్తన కంపెనీలను కట్టడి చేసేందుకు త్వరలో కొత్త విత్తన చట్టం రాబోతుందని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. తమ కమిషన్, వ్యవసాయ శాఖ కలిసి దీనిని తయారు చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో మళ్లీ ఆదర్శరైతు వ్యవస్థను తెస్తున్నామని, వ్యవసాయాధికారులు ప్రతి గ్రామానికి ఒక ఆదర్శరైతును త్వరలో ఎంపిక చేయనున్నారని చెప్పారు. వారికి వేతనాలు ఉండవని, గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు వారి ద్వారా అమలు జరుగుతాయన్నారు. బుధవారం హైదరాబాద్లోని కమిషన్ కార్యాలయంలో సభ్యులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనోత్పత్తిలో జరిగిన మోసాలు తెలిసిన వెంటనే కమిషన్ విచారణ జరిపి 671 మంది గిరిజన రైతులకు నష్టపరిహారం కింద రూ.4 కోట్లు పంపిణీ చేయించింది. తెలంగాణలో ఏ రైతుకు కష్టం వచ్చినా రైతు కమిషన్ అందుబాటులో ఉంటుంది’’ అని కోదండరెడ్డి చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com