RAINS: రైతన్నను ఆగం చేస్తున్న అకాల వర్షాలు

RAINS: రైతన్నను ఆగం చేస్తున్న అకాల వర్షాలు
ధాన్యం తడిసి రైతుల అవస్థలు... చేతికి వచ్చిన పంట వర్షార్పణం కావడంతో దిక్కుతోచని స్థితిలో రైతన్న

తెలంగాణలో అన్నదాతను అకాల వర్షాలు ఆగం చేస్తున్నాయి. నాలుగైదు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసి రైతులు అవస్థ పడుతున్నారు. రోజంతా ధాన్యం ఆరబెట్టడం.. సాయంత్రానికి తిరిగి కుప్పలుగా వేయడమే తప్ప.. అధికారులు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి వచ్చిన పంట వర్షార్పణం కావడంతో రైతన్న దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అకాల వర్షంతో కామారెడ్డి జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల ఆడ్లూర్, టేక్రియాల్, లింగాపూర్.. దోమకొండ మండలంలోని సంగమేశ్వర్, భిక్కనూర్ మండలంలో వరి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుకాలం శ్రమించి పండించిన పంట వర్షార్పణం అవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

వరి పంట కోసి కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి 20 రోజులవుతున్నా.. సరైన సమయంలో కాంటా చేయకపోవడం వల్లనే నష్టపోతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం పూట ఎండ.. సాయంత్రం నాలుగు గంటలు కాగానే వానలు పడుతున్నాయి. వర్షం దాటికి వడ్లు పూర్తిగా నాని మొలకలొస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రబీ సీజన్ల్‌లో 41 వేల 309 మంది రైతుల నుంచి 518 కోట్ల విలువగల రెండు లక్షల 35వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని జిల్లా పౌర సరఫరాల అధికారి తెలిపారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 70 శాతం వడ్లను కొనుగోలు చేసినట్లు చెప్పారు.


తడిసి ముద్దయిన ధాన్యం

వరి పంట కోసి కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి 20 రోజులు గడిచినప్పటికీ సరైన సమయంలో రైతుల నుంచి సేకరించి కాంటా చేయకపోవడం వల్లనే నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలు, లారీల కొరత ఉందని తెలిపారు. మరోవైపు ఉదయం పూట ఎండ కొడుతూ సాయంత్రం నాలుగు గంటలు కాగానే వారం రోజులుగా వానలు పడుతున్నాయి.

మొలకొస్తున్న వడ్లు

వర్షం ధాటికి వడ్లు పూర్తిగా తడిచి మొలకలొస్తున్నాయి. ఫలితంగా చేసిన కష్టం నీటిపాలవుతుండటంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిన్న పలు మండలాలతో పాటు గ్రామాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు ఆరబెట్టిన ధాన్యం నీటమునిగింది. వరి కొనుగోలు కేంద్రాలు చెరువుల్లా మారిపోయాయి. దీంతో అన్నదాతలు వరి ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. వరి ధాన్యం కొట్టుకుపోతుంటే ఏమీ చేయలేని స్థితిలో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Next Story