FIRE ACCIDENT: పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.60 కోట్ల నష్టం

హైదరాబాద్ పాతబస్తీ దివాన్దేవిడిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నాలుగో అంతస్తులో ఉన్న బట్టల షాప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సుమారు 30 కి పైగా బట్టల షాపులకు మంటలు అంటుకున్నాయి. 20 ఫైర్ ఇంజన్లు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. వరుసగా ఉన్న పలు షాప్స్కి మంటలు వ్యాపించి భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని వ్యాపారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లోనే భారీ అగ్నిప్రమాదం..!
దివాన్ దేవిడిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో.. రూ.60కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. అబ్బాస్, మదినా టవర్లో దాదాపు 400 వరకు రెడీమెడీ వస్త్ర వ్యాపారాలు నిర్వహించే హోల్సోల్ దుకాణాలున్నాయి. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 30 వరకు దుకాణాలు పూర్తిగా దగ్దమైనట్లు పోలీసులు తెలిపారు. విద్యుదాఘాతమే.. ఈ అగ్ని ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు.
వస్త్ర దుకాణంలో కావడంతోనే..
దివాన్దేవిడిలో అన్నీ వస్త్రాలు కావడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెంది.. అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. హైకోర్ట్, యాకుత్పుర, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మలక్పేట, సాలర్జంగ్ మ్యూజియం, రాజేంద్రనగర్ ఏరియాల నుంచి ఫైరింజన్లను రప్పించి.. 60 మంది సిబ్బంది కలిసి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. అబ్బసి మదినా టవర్లో చిన్న చిన్న గదులు ఉండడంతో మంటలు అదుపు చేయడం కాస్త ఇబ్బందికరంగా మారిందని అధికారులు తెలిపారు. సముదాయంలో 400 వరకు దుకాణాలు కొనసాగుతున్నాయని.. ఎక్కడా ఫైర్ సేఫ్టీ లేదని గుర్తించినట్లు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com