GHMC Council Meeting: రసాభాసగా జీహెచ్ఎంసీ సమావేశం..

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని, మేయర్ పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో, సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీనే అని మేయర్ మండిపడ్డారు. ఈ అంశంపై నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ కు సిగ్గుండాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆందోళనలు ఆపకపోతే... సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తానని హెచ్చరించారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో... సమావేశాన్ని ఆమె 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.
మరోవైపు విజయలక్ష్మితో పాటు డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత కూడా బీఆర్ఎస్ తరపునే గెలుపొందారు. ఇటీవలే వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో, వీరిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమయింది. ఈ క్రమంలోనే వీరి రాజీనామాకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు.
ఈరోజు ఉదయం 10 గంటలకు బల్దియా కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే గందరగోళంగా మారింది. మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ డ్రైనేజీ సిటీ అంటూ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. కాల్వలను అనుసంధానం చేసి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ అఫీషియో సభ్యులు, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరయ్యారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల మద్దతుతో గద్వాల్ విజయలక్ష్మి, మోతె శ్రీలత మేయర్, డిప్యూటీ మేయర్ అయ్యారు. వీరిద్దరూ పార్టీ మారడంతో మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com