BONALU: ఘనంగా ఆరంభమైన గోల్కొండ బోనాలు

BONALU: ఘనంగా ఆరంభమైన గోల్కొండ బోనాలు
X
తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు... రంగం ఎప్పుడంటే..?

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల జాతర ప్రారంభమైంది. ఆషాఢమాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగరంలో బోనాల సందడి నెలకొంది. గోల్కొండ జగదాంబిక మహంకాళీ ఎల్లమ్మ బోనాలు.. గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వాహకుల ఆధ్వర్యంలో లంగర్‌హౌజ్‌ చౌరస్తాలో ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు బోనాలను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేశారు. అక్కడి నుంచి పట్టు వస్త్రాల ఊరేగింపు, తొట్టెల ఊరేగింపు గొల్కొండ కోట వరకు కొనసాగాయి. బోనాల నిర్వహణ ఖర్చు కోసం ప్రభుత్వం తరఫున రూ. 11లక్షల చెక్‌ను మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, గోల్కొండ ఈవో శ్రీనివాస రాజు ఉత్సవ కమిటీ సభ్యులకు అందజేశారు.


తెలంగాణ ప్రభుత్వం తరఫున స్పీకర్ గడ్డం ప్రసాద్ , మంత్రులు కొండ సురేఖ , పొన్నం ప్రభాకర్ , మేయర్ గద్వాల్ విజయలక్ష్మి , డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి , ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ , ప్రిన్సిపాల్ సెక్రెటరీ శైలజ , కలెక్టర్ అనుదీప్ బోనాలను అధికారికంగా ప్రారంభించారు. చారిత్రక గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు మొదలయ్యాయి. బోనాల వేడుక చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. డప్పు చప్పళ్లు, శివసత్తులు పూనకాలు, పోతరాజులు విన్యాసాలతో గోల్కొండ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. బోనాల సందడి ఆషాడం మాసం ముగిసేవరకూ ఘనంగా జరగనున్నాయి..ఆఖరి రోజు గోల్గొండ కోటలోనే ముగింపు ఉత్సవాలు జరగనున్నాయి.


అంటే మొదటి పూజ చివరి పూజ గోల్కొండ జగదాంబ అమ్మవారి ఆలయంలోనే .ఈ నెల 21న లష్కర్‌ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాంళి బోనాలు, ఈ నెల 28న పాతబస్తీ లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలు జరుగుతాయి. పాతబస్తీలో 11 రోజుల పాటు ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతాయి. సింహవాహిని మహంకాళి ఆలయంతో పాటూ ఉప్పుగూడ మహంకాళి ఆలయం, హరిబౌలి అక్కన్న మాదన్న ఆలంయాల్లోనూ బోనాలు సమర్పిస్తారు. ఈ నెలలో ప్రతి గురువారం, ఆదివారం బోనాల వేడుకలు నిర్వహిస్తారు. ఇక సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో జరిగే బోనాలకు ఘనచరిత్ర ఉంది. 1814 నుంచి అక్కడ బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. జూలై 29న రంగం నిర్వహించనున్నారు. అంబారీపై అమ్మవారి ఊరేగింపు, పలహారం బండ్ల ఊరేగింపు నిర్వహిస్తారు.

Tags

Next Story