TGPSC: తెలంగాణలో నేడే గ్రూప్ 3 పరీక్షలు

TGPSC: తెలంగాణలో నేడే గ్రూప్ 3 పరీక్షలు
X
పకడ్బందీ ఏర్పాట్లు చేసిన టీజీపీఎస్సీ.... ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని సీఎస్ ఆదేశాలు

తెలంగాణలో 1,365 గ్రూప్‌-3 పోస్టుల భర్తీకి నేడు, రేపు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 ఉంటుంది. రేపు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-3 పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ప్రతి పేపరు పరీక్ష సమయానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని కమిషన్‌ ప్రకటించింది.

అన్ని ఏర్పాట్లు పూర్తి

తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆది, సోమవారాల్లో పరీక్షలు జరగనుండగా.. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 1401 పరీక్షా కేంద్రాలను కేటాయించగా.. దాదాపు 5.36 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. 1,365 పోస్టులకు పరీక్ష జరగనుంది. ఇవాళ రెండు పేపర్లు, సోమవారం ఒక పేపర్‌కు పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

కలెక్టర్ కీలక విజ్ఞప్తి

హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులకు కలెక్టర్ అనుదీప్ కీలక సూచనలు చేశారు. జిల్లావ్యాప్తంగా 102 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అరగంట ముందే పరీక్షా కేంద్రాల గేట్లు మూసేస్తారని.. అభ్యర్థులు ఒరిజినల్ ఐడీతో పరీక్షకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్ కాపీని భద్రంగా ఉంచుకోవాలని టీజీపీఎస్సీ తెలిపింది. తొలిరోజు పేపర్ - 1 పరీక్షకు తీసుకొచ్చిన హాల్‌టికెట్‌ను మిగతా పరీక్షలకు ఉపయోగించాలని పేర్కొంది. నియామక ప్రక్రియ ముగిసే వరకూ ప్రశ్నపత్రాలు, హాల్‌టికెట్లను భద్రంగా పెట్టుకోవాలని కమిషన్ సూచించింది.

అభ్యర్థులకు TGPSC కీలక సూచనలు

TG: గ్రూప్-3 పరీక్షల నేపథ్యంలో అభ్యర్థులకు TGPSC అధికారులు కీలక సూచనలు చేశారు. ఉదయం 9.30కి ప్రారంభమయ్యే పేపర్‌-1కు 8.30 గంటల కల్లా, మధ్యాహ్నం జరిగే పేపర్-2కు 1.30 గంటల కల్లా పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలని సూచించారు. ఉదయం జరిగే పరీక్షకు 9.30 తర్వాత, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.30 తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.

Tags

Next Story