CM Revanth Reddy: వర్షం.. బీభత్సం

CM Revanth Reddy:  వర్షం.. బీభత్సం
X
సహాయక చర్యల్ని ముమ్మరం చేయండి

వర్షం విలయం సృష్టించింది. నింగి, నేల ఏకమైనట్లుగా కుంభవృష్టి కురవడంతో రాష్ట్రంలో జనజీవనం స్తంభించిపోయింది. వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగిపొర్లి గ్రామాలు, కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉప్పొంగి.. ఖమ్మం నగరాన్ని ముంచెత్తింది. మహబూబాబాద్‌,ములుగు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

తెగిన కాలువలు.. కొట్టుకుపోయిన చెరువు కట్టలు

నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పలుచోట్ల సాగునీటి కాలువలు తెగిపోయాయి. చెరువుల కట్టలు కొట్టుకుపోయాయి. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై అనేక చోట్ల వరద చేరడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురంలో 132.5 కి.మీ. వద్ద ‘సాగర్‌’ ఎడమ కాల్వకు భారీ గండి పడింది. ఖమ్మం జిల్లా పరిధిలోనూ నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వకు రెండుచోట్ల భారీ గండ్లు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు 15 మంది మృతి చెందగా.. ఐదుగురికిపైగా గల్లంతయ్యారు.

మహబూబాబాద్ను ముంచెత్తిన వాన

భారీవర్షాలతో మహబూబాబాద్‌ జిల్లా అతలాకుతలమైంది. జిల్లాలో 29.67 సెంటీమీటర్లు సగటు వర్షపాతం నమోదవగా, అత్యధికంగా చిన్నగూడూరులో 45.06 సెంటీమీటర్లు కురిసింది. రైలు, రోడ్డు మార్గాలన్నీ పూర్తిగా బంద్‌ అయ్యాయి. చెరువులకు గండ్లు పడి సుమారు 20 వేల ఎకరాల్లో వరి, 10 వేల ఎకరాల్లో ఇతర పంటలు నీట మునిగినట్టు ప్రాథమిక అంచనా. కేసముద్రం మండలం ఇంటికన్నె వద్ద రెండు చోట్ల రైల్వే ట్రాక్‌ కొట్టుకుపోయింది.

మున్నేరు ఉగ్రరూపం.. కన్నీరు పెట్టిన ఖమ్మం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురిసిన భీకర వర్షం జలప్రళయాన్ని తలపించింది. శనివారం అర్ధరాత్రి నుంచి మొదలైన వరద రాత్రికి రాత్రే ఊళ్లను, కాలనీలను ముంచెత్తింది. జిల్లాలో గరిష్ఠంగా 32 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 51 వేల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ఖమ్మం నగర సమీపంలోని మున్నేరు మహోగ్రరూపం దాల్చింది. మున్నేరుపై ప్రకాశ్‌నగర్‌ వద్ద ఉన్న వంతెన పైనుంచి 10 అడుగుల మేర వరద ప్రవహించింది. సుమారు 15 కాలనీలు ముంపునకు గురయ్యాయి. మూడో అంతస్తు, అపైన ఉన్న భవనాలపైకి ప్రజలు చేరుకుని.. సాయం కోసం ఎదురుచూశారు. ఖమ్మం జిల్లాలో దాదాపు 110 గ్రామాలు వరద ప్రభావానికి గురైనట్లు అంచనా వేస్తున్నారు.

ఆకేరు ఉధృతంగా ప్రవహించడంతో ఆదివారం తెల్లవారుజామున రాకాసితండా నీట మునగడంతో తండావాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గుట్టలు, డాబాలు ఎక్కి ఆర్తనాదాలు చేశారు. వారిని పడవల ద్వారా రక్షించి, 80 మందిని పునరావాస కేంద్రానికి తకలించారు.

కొత్తగూడెం పట్టణంలో శ్రీనగర్, ప్రగతినగర్‌ ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద చేరింది. బూర్గంపాడు మండలంలోని ఊర్లదోసపాడులో పాలవాగు వరద ఉదృతికి 30 పశువులు కొట్టుకుపోయాయి. కిన్నెరసాని గ్రామంలో 13, ఉల్వనూరులో 30 నివాసాలు నీట మునిగాయి. భారీ వర్షం ధాటికి భద్రాద్రి జిల్లా కూడా అతలాకుతలమైంది. లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి.

మంత్రుల పర్యటన..

ఖమ్మం నగరంలోని మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం సాయంత్రం పర్యటించారు. ప్రకాశ్‌నగర్‌ వంతెనపై 9 మంది చిక్కుకున్నా ఎవరూ స్పందించలేదని స్థానికులు చెప్పడంతో అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్నేరు ముంపునకు గురైన వెంకటగిరి వంతెన, కరుణగిరి ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రఘురాంరెడ్డి పర్యటించారు. బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

పొటెత్తిన పాలేరు...

సూర్యాపేట జిల్లా నల్లబండగూడెం వద్ద పాలేరు వాగు పోటెత్తింది. పాలేరు రిజర్వాయర్‌కు వరద పోటెత్తడంతో రాత్రికి రాత్రే ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. పాలేరు పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా 28 అడుగులకు పైగా నీరు వచ్చి చేరింది. సమీపంలోని చెరువులు కట్టలు తెగడంతో రాష్ట్ర సరిహద్దు అయిన కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద ప్రవహించింది. హైదరాబాద్, సూర్యాపేటల నుంచి ఖమ్మం వైపు రాకపోకలు నిలిచిపోయాయి

నీట మునిగిన కోదాడ

చిమిర్యాల, పాలేరు వాగులు పొంగిపోర్లాయి. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కోదాడలో వర్షం కురవడం, ఆక్రమణల కారణంగా పెద్ద చెరువు అలుగు నీళ్లు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీ, అంబేడ్కర్‌నగర్, గాంధీనగర్, భవానీనగర్, మాత నగర్, హెచ్‌ఆర్‌ నగర్, నయానగర్, ఆజాద్‌నగర్, శ్రీనగర్‌ కాలనీలు మునిగిపోయాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భారీ వర్షంతో పలు కాలనీలు జలదిగ్బంధమయ్యాయి.

Tags

Next Story