భారీవర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..!

హైదరాబాద్ జంట నగరాల్లో కురిసిన భారీ వర్షానికి.. నగరం అతలాకుతలమైంది. కుండపోత వానకు రహదారులన్నీ నీటమునిగాయి. కాలనీలుజలమయ మయ్యాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మూసి పరివాహక ప్రాంతాల్లో డ్రైనేజీలు ఉప్పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కమలానగర్ ప్రాంతాల్లో కాలనీలు నీట మునిగాయి. సరూర్నగర్ చెరువులోకి భారీగా వరద చేరడంతో చైతన్యపురి పరిధిలో పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. వీధుల్లోకి వరదనీరు పోటెత్తింది. దిల్సుఖ్నగర్లోని పీ అండ్ టీ కాలనీ, కోదండరామ్ నగర్ వీవీ కాలనీల్లో వీధులు నదులను తలపించాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదతో ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. హయత్నగర్ ఆర్టీసీ డిపోలోకి భారీగా వరదనీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భారీ వర్షానికి నాగోల్ పరిధిలోని అయ్యప్పకాలనీ నీట మునిగింది. దీంతో కాలనీ ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి తమ బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. సుమారు 400 ఇళ్లు ఉండగా సగం ఇళ్లలోకి వరద ప్రవాహం వచ్చి చేరింది. దీంతో అయ్యప్పనగర్ కాలనీ, మల్లికార్జుననగర్, ఫేజ్-2 త్యాగరాజనగర్కాలనీ వాసులు ఇళ్లు ఖాళీ చేసి బయటకెళ్లారు. హబ్సిగూడా, అంబర్పేట్, రామంతపూర్ డివిజన్లలో భారీగా వాన పడడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. యూసుఫ్గూడ, శ్రీ కృష్ణనగర్ బి బ్లాకులో వరద నీరు రోడ్లపై భారీగా ప్రవహించింది.
ఎల్బీనగర్లో గత ఏడాది వరద పరిస్థితులు మళ్లీ రిపీట్ అవుతున్నాయి. ఇంళ్లలోకి వర్షపు చేరుతోంది. కొన్నిచోట్ల నడుంలోతు, చాలాచోట్ల మోకాళ్ల లోతు వరకు నీరు చేరింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్బీనగర్లో 15 సెంటీమీటర్ల వర్షం కురవడంతో ఆ వరదంతా డ్రైనేజీల్లోంచి బయటకు వెళ్లే మార్గం లేక రోడ్లపై నిలిచిపోయింది. కొన్ని చోట్ల ముంపు కాలనీల్లో నీరు చేరడంతో ఇండ్లలోంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలు మరో రెండ్రోజులపాటు కంటిన్యూ అయితే గనుక ముంపు కాలనీల్లోని జనాల్ని తరలించేందుకు బోట్లు తిప్పాల్సిన పరిస్థితి రావచ్చు.
ఎల్బీనగర్లో 9 నెలల క్రితం భారీ వర్షాలు కురిసిన సమయానికి, ఇప్పటికీ ఏ మార్పు కనిపించడం లేదు. భవిష్యత్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్న అధికారులు.. ప్రతినిధులు ప్రకటించినా చర్యలు మాత్రం తీసుకోలేదు. గతేడాది వర్షాల తర్వాత 858 కోట్లతో నాలాల విస్తరణ ప్రతిపాదన చేపట్టిన జీహెచ్ఎంసీ.. ఏడాదిలో ఖర్చుపెట్టింది కేవలం ఒక కోటి 50 లక్షలు మాత్రమే. ఇక నీళ్లు నిలబడే ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థలో మార్పులు చేయడంతో పాటు అవసరమైన చోట కొత్తగా పైపులైన్లు ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ ఎక్కడా అలాంటి చర్యలు తీసుకోలేదు. నాలాల విస్తరణ, ఆక్రమణల తొలగింపు, కొన్ని చోట్ల పరిహారం చెల్లింపులు చేయాల్సి వస్తుందనే అంచనాతోనే నాడు 858 కోట్లు బడ్జెట్ ప్రతిపాదించి కూడా పనులు మొదలుపెట్టలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com