RAINS: తెలంగాణలో భారీ వర్షాలకు రైల్వే ట్రాక్ ధ్వంసం

తెలంగాణలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మహబూబాబాద్ సమీపంలోని అయోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగింది. దీంతో విజయవాడ- కాజీపేట మార్గం మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ఎగువు, దిగువ రైలు మార్గాల్లో కంకర కొట్టుకుపోయింది. మహబాబూబాద్ శివారులో రైలుపట్టాలపై భారీగా వరదనీరు ప్రవహిస్తుండడంతో మచిలీపట్నం, సింహపురి ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. మహబూబాబాద్ రైల్వేస్టేషన్లో వాటిని ఆపేశారు. తాళ్లపూసలపల్లి వద్ద రైల్వేట్రాక్కు వరద తాకింది. దీంతో పందిళ్లపల్లి వద్ద 4 గంటలపాటు మహబూబ్నగర్-విశాఖ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది.
డేంజర్లో హుస్సేన్సాగర్
HYD: నగరంలో భారీ వర్షాల కారణంగా హుస్సేన్సాగర్కు వరద పోటెత్తింది. బంజారా, పికెట్, కూకట్పల్లి నాలాల నుంచి వరద హుస్సేన్సాగర్లోకి వస్తుంది. జలాశయం నీటి మట్టం పూర్తి స్థాయికి చేరింది. దీంతో తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని మూసిలోకి వదులుతున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండాలని సూచించారు.
ఇంటి గోడ కూలి తల్లికూతురు మృతి
మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నారాయణపేట జిల్లా, కొత్తపల్లి మండలం ఎక్కమేడు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆదివారం తెల్లవారుజామున ఇల్లు కూలి తల్లి, కూతురు మృతిచెందారు. మరణించిన వారిని హనుమమ్మ, కూతురు అంజులమ్మగా గుర్తించారు.
కలెక్టరేట్ లో సహాయక కేంద్రం ఏర్పాటు
మంచిర్యాల జిల్లాలో రాబోయే 2, 3 రోజుల్లో భారీ వర్షాల సూచనల నేపథ్యంలో ప్రజల సహాయార్థం కలెక్టరేట్ లో సహాయక కేంద్రం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండి వరద ప్రభావిత ప్రాంతాలపై అప్రమత్తంగా ఉంటూ రక్షణ చర్యలపై దృష్టి సారించాలన్నారు. ప్రజలు సహాయ సేవల కోసం కంట్రోల్ రూం నెంబర్ 08736250501ను సంప్రదించాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com