ఆగని వర్షాలు.. అన్ని కార్యాలయాలకు సెలవులు..

ఆగని వర్షాలు.. అన్ని కార్యాలయాలకు సెలవులు..
మూడు రోజులుగా ముసురు కమ్మేస్తోంది. జనం బయటకు రావాలంటే భయపడిపోతున్నారు.

మూడు రోజులుగా ముసురు కమ్మేస్తోంది. జనం బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. ఆగకుండా కురుస్తున్న వర్షం వల్ల అవసరానిక్కూడా బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు శుక్రవారం, శనివారం సెలవులు ప్రకటించారు.

ప్రయివేటు సంస్థలు కూడా తమ తమ కార్యాలయాలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కార్మికశాఖను ఆదేశించారు. మందులు, పాలు సరఫరా వంటి అత్యవసర సేవలు మాత్రమే అనుమతించబడతాయి.

గోదావరి నదీ పరీవాహక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, భద్రాచలం వద్ద నీటిమట్టాలు పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించిన చంద్రశేఖర్‌రావు, తక్షణ చర్యలు చేపట్టి వరద పరిస్థితిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు వెంటనే అధికారులు అప్రమత్తం కావాలని పోలీసులతోపాటు అధికారులను ఆయన కోరారు.

భద్రాచలం, పరిసర ప్రాంతాల్లోని ప్రభావిత ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారి భద్రతకు ప్రాధాన్యమివ్వాలన్నారు. గత వరదల సమయంలో సమర్థవంతంగా నిర్వహించిన అనుభవజ్ఞులైన అధికారులను రంగంలోకి దించి పరిస్థితిని చక్కదిద్దాలని సూచించారు. గతంలో గోదావరి నదికి వరదలు వచ్చినప్పుడు సహకరించిన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెంటనే భద్రాచలం వెళ్లాలని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

సహాయక చర్యలను సమర్ధవంతంగా సమన్వయం చేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర సచివాలయంతో పాటు జిల్లా కలెక్టరేట్లు, వర్ష ప్రభావిత జిల్లాల్లోని MRO కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. అదనంగా, సహాయక చర్యలు చేపట్టేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలతో పాటు ఇతర అధికారులను సిద్ధంగా ఉంచాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పంచాయితీ రాజ్, వైద్య, ఆరోగ్య శాఖ, విపత్తు నిర్వహణ శాఖలతోపాటు వివిధ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడం, అధికారుల నుండి సకాలంలో ప్రతిస్పందన ఉండేలా సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ శాంతి కుమారికి బాధ్యతలు అప్పగించారు.

Tags

Read MoreRead Less
Next Story