High Court : రిపబ్లిక్ డేను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాల్సిందే
గణతంత్ర వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. 'రిపబ్లిక్ డే' వేడుకలపై దాఖలైన వ్యాజ్యంలో హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది. ఉత్సవాలను తప్పనిసరిగా నిర్వహించాలని స్పష్టం చేసింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవద్దని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పిలుపును తొసిపుచ్చింది హైకోర్టు. రక్షణ శాఖ సూత్రీకరణలకు కట్టుబడి గణతంత్ర వేడుకలను జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
గణతంత్ర దినోత్సవ వేడుకలపై దాఖలైన రిట్ వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది. వేడుకలను తప్పనిసరి నిర్వహించాలని, వేడుకల్లో భాగంగా పరేడ్ నిర్వహించాలని స్పష్టం చేసింది.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రిపబ్లిక్ డే వేడుకలను జరపడంలేదని రాజ్ భవన్ లోనే జెండా వందనం జరుపుకోవాలని సీఎంఓ, రాజ్ భవన్ అధికారులకు తెలిపింది. 2022లో కోవిడ్-19 ఆంక్షల కారణంగా పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర వేడుకలను నిర్వహించకూడదని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని ఈ ఏడాది కూడా పాటించాలని రాజ్ భవన్ అధికారులకు సీఎంఓ తెలిపినట్లు సమాచారం.
హైకోర్టు తీర్పును బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్వాగతించారు. గణతంత్ర వేడుకలను నిర్వహించాలని హైకోర్టు సీఎం కేసీఆర్ ను ఆదేశించాల్సి రావడం విచారకరమని అన్నారు. "సత్యమేవ జయతే, హైకోర్టు తీర్పు కేసీఆర్ కు చెంపపెట్టు. గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని, నిబంధనలను పాటించాలని హైకోర్టు ప్రభుత్వానికి చెప్పవలసి వచ్చింది. సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య పద్దతులను కించపరిచారు. కేసీఆర్ గవర్నర్ కు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి" అని బండి సంజయ్ ట్వీట్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com