HC: కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు వాయిదా

HC: కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు వాయిదా
X
ఈ నెల 22వ తే­దీ­కి వా­యి­దా వే­సిన ధర్మా­స­నం

కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు వాయిదా పడటం రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఏర్పాటైన పీసీ ఘోష్ కమిషన్ విచారణ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈరోజు తుది తీర్పు వెలువడాల్సి ఉండగా, ధర్మాసనం అనూహ్యంగా విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాజకీయ వర్గాలు, ప్రజల్లో ఈ పరిణామం ఉత్కంఠను మరింత పెంచింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను ఇప్పటికే కె. చంద్రశేఖర్ రావు, టి. హరీష్ రావు సహా పలువురు సవాల్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్, మాజీ సీఎస్ జోషి కూడా కమిషన్ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ పిటిషన్లపై గత కొంతకాలంగా సుదీర్ఘ వాదనలు కొనసాగగా, మార్చి 12న విచారణ పూర్తయిన తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

పిటిషనర్ల తరఫున న్యాయవాదులు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించబడ్డాయని వాదించారు. ముఖ్యంగా 8(B), 8(C) నోటీసులు జారీ చేయలేదని, సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ జరగలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పూర్తి స్థాయి విచారణ లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం నిర్ణయానికి రావడం సరైంది కాదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం తరఫున మాత్రం ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ కమిషన్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రాజెక్టుకు సంబంధించిన అనుమానాస్పద అంశాలను వెలికితీయడం, పారదర్శకతను నెలకొల్పడం లక్ష్యంగా విచారణ చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తుది తీర్పు ఏ విధంగా ఉండబోతుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఏప్రిల్ 22న వెలువడనున్న తీర్పు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags

Next Story