ఇంతకీ ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్ నేతలను కేసీఆర్ ఎలా డీల్ చేయనున్నారు?

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల కురుక్షేత్రంలో ఆరితేరిన వ్యక్తి.. మోదీ వేవ్ తప్పదని ఊహించి ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయడంకా మోగించారు. ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు వేస్తున్నారు.. ప్రతిపక్షాలు తేరుకోకముందే అన్ని సిద్దం చేసుకొని.. సవాల్ విసరడంలో కేసీఆర్ కు సాటిలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే పోటీ ఎదుర్కొన్నా.. ఈ సారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పుడు పీసీసీ ఛీఫ్ గా రేవంత్ , బీజేపీ ఛీఫ్ గా బండి సంజయ్ ఇద్దరు యువనేతలతో పార్టీలు కదనరంగంలోకి దూకబోతున్నాయి. ఇంతకీ ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్ నేతలను కేసీఆర్ ఎలా డీల్ చేయనున్నారు... వారితో ముప్ప తప్పదని భావిస్తున్నారా.. లేక తమకే మేలని అనుకుంటున్నారా?
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా TRS దే విజయం అన్నట్టుగా పరిస్థితి ఉంది. కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీకి తిరుగులేని విజయాన్ని సాధించిపెడుతున్నాయి. 2014 లో 63 సీట్లే సాధించినప్పటికీ .. దూరదృష్టితో ఆలోచించి.. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేశారు. హస్తం పార్టీఎమ్మెల్యేలను సైతం తమ పార్టీలో చేర్చు కొని బలమైన శక్తిగా తెలంగాణలో ఆవిర్బవించారు. 2019 లో ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. ప్రతిపక్షాలకు సమయం ఇవ్వకుండా... సడన్ గా ముందస్తుకెళ్లి ప్రతిపక్షాలకు షాక్ ఇఛ్చారు.. వారు తేరుకొనే లోపు ఎన్నికలు రావడంతో.. తిరుగలేని విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ఈ సారి కూడా చీల్చి ..పార్టీలో చేర్చుకొని.. కోలుకోలేని దెబ్బతీశారు. అటు బీజేపీతో అంతర్గత సహకారం తీసుకుంటూ ముందుకెళ్లారు.
మరోవైపు కాంగ్రెస్ కు సరైన నాయకత్వం లేకపోవడంతో .. బీజేపీ పుంజుకోవడానికి పార్లమెంట్ ఎన్నికలు దోహదపడ్డాయి.. 4 పార్లమెంట్ సీట్లు గెలవడంతో తెలంగాణలో ఆ పార్టీకి ఆశలు చిగురించాయి. ఉత్తమ్ రాజీనామాతో జరిగిన హుజూర్నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడం.. కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కోల్పోవడంతో .. ప్రజల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం లేదనే భావన కలిగింది. అయితే కరీంనగర్ నుంచి గెలిచిన ఎంపీ బండిసంజయ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుణ్ని చేయడం.. దుబ్బాకలో బీజేపీ గెలవడం... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి షోతో బీజేపీ శ్రేణుల్లో ఆశలు కాస్త చిగురించాయి. అయితే ఆ తర్వాత బండి సంజయ్ దూకుడు మెయింటేన్ చేయలేకపోయారనే వాదన ఉంది. ఇక కాంగ్రెస్ వరుస ఎన్నికల్లో ఓటమి చెందడం.. ఉత్తమ్ రాజీనామా చేసినా.. కొత్త అధ్యక్షుని ఎంపికపై ఎటూ తేల్చుకోలేకపోవడంతో .. క్యాడర్ లో నైరాశ్యం ఆవహించింది. కొంతమంది లీడర్లు బీజేపీలో చేరిపోయారు. అటు ఈటల రాజేందర్ లాంటి బలమైన బీసీ నేత బీజేపీలో చేరడంతో .. అందరి దృష్టి హుజూరాబాద్ పై పడింది. ఇదే సమయంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేయడంతో ఆ పార్టీలో కొత్త జోష్ వచ్చింది.
హుజూరాబాద్ లో ఈటల వర్సెస్ టీఆర్ఎస్ ఇప్పటి ఎన్నికవరకు అందరూ భావిస్తున్నారు.. అయితే రేవంత్ రాకతో ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుందా అనేది మున్ముందు తేలనుంది. సార్వత్రిక ఎన్నికల వరకు మాత్రం అటు బండి సంజయ్, ఇటు రేవంత్ ఇద్దరూ దూకుడు గా వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇద్దరు నేతలు కేసీఆర్ ను తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తూ విమర్శిస్తుంటారు. ప్రస్తుతానికి టీఆర్ఎస్ ఇరిగేషన్, సంక్షేమ పథకాలతో తమకు తిరగులేదని భావిస్తోంది. తెలంగాణలో మూడున్నర కోట్ల మందిలో దాదాపు కోటిన్నరమంది ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్దిపొందుతున్నారు. 60 లక్షల మంది రైతులకు రైతుబంధు , 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు, రైతుబీమా, కేసీఆర్ కిట్ , కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఇలాంటి అనేక పథకాలతో ప్రభుత్వంపై ప్రస్తుతానికి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది. దుబ్బాకలో ఓడినా.. నాగార్జునసాగర్ లో జనం టీఆర్ఎస్ కు జై కొట్టడంతో .. జానారెడ్డి లాంటి సీనియర్ నేతసైతం ఓడిపోయారు. అయితే నిరుద్యోగులు, మేధావులు, కేసీఆర్ విధానాలను విమర్శించే సెక్షన్ మొత్తం ఎదో ఒక పార్టీకి అటాచ్ అయితే టీఆర్ఎస్ ను ఓడించవచ్చనేది దుబ్బాకలో తేలింది.
కాంగ్రెస్ ను కాదని దుబ్బాకలో ప్రజలు బీజేపీవైపు మొగ్గారు. ఫలితంగా టీఆర్ఎస్ ఓడింది. ఓటమి నుంచి తేరుకున్న టీఆర్ఎస్... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ ఎదుర్కొన్నప్పటికి .. పట్టు నిలుపుకుంది. ఆ తర్వాత జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో... నిరుద్యోగులు, మేధావుల ఓట్లు పడక టీఆర్ఎస్కు ఓటమి తప్పదేమో అనే భావన వచ్చినా... ప్రతిపక్ష అభ్యర్థుల మధ్య ఓట్లు చీలడంతో టీఆర్ఎస్ గెలుపు సులువైంది. బీజేపీ సిట్టింగ్ సీటును సైతం పీవీ నర్సింహారావు కూతురు వాణిని చివరి నిమిషంలో నిలబెట్టి సక్సెస్ అయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కడా పోటీ ఇవ్వలేదు. హుజూరాబాద్తో పాటు.. 2023 ఎన్నికల్లోనూ కేసీఆర్ ఇదే ఫార్ములా అవలంభించినా అశ్చర్యపోనక్కర లేదంటున్నారు విశ్లేషకులు. అలాగే రేవంత్ పీసీసీ చీఫ్ కావడంతో ... ప్రభుత్వ వ్యతిరేక ఒట్లు రెండు పార్టీల మధ్య చీలితే ... టీఆర్ఎస్ గెలవడం ఖాయమనే భావన ఆ పార్టీలో కనిపిస్తోంది..
బీజేపీ పార్టీ కన్నా.. కాంగ్రెస్ పార్టీతోనే తమకు అసలైన పరీక్ష అని టీఆర్ఎస్ భావిస్తోంది. ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల.. ఎంఐఎం బూచి చూపి హిందుత్వ ఎజెండాతో కొన్ని చోట్ల బీజేపీ ప్రభావం చూపుతుదంనే భావనలో గులాబీ నేతలు ఉన్నారు.. వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని భావించినా.. పదిసీట్లకే పరిమితమైంది. అయితే కాంగ్రెస్కు రేవంత్ రూపంలో డీ అంటే డీ అనగల యువనేత రావడంతో .. ట్రయాంగిల్ ఫైట్ పై అంచనాలు పెరిగాయి. మరోవైపు టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోరు జరిగినా తమకే లాభిస్తోందనే భావనతో కేసీఆర్ ఉన్నారు. ఉద్యోగులు , రైతులు, ఆసరా పెన్షనర్లు , మైనార్టీలు టీఆర్ఎస్ వెంటే ఉంటారని గులాబీ బాస్ ధీమాతో ఉన్నారు. అటు విశ్లేషకులు సైతం కేసీఆర్ వ్యతిరేక శక్తులు ఏకం అయితే తప్ప.. కేసీఆర్ కు పోటీ ఉండదంటున్నారు. హుజూరాబాద్ సమరం వరకైతే... ఉద్యమకారులంతా బీజేపి మద్దతిచ్చే యోచనలో ఉండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తేనే.. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుంది.
ఫలితం తారుమారైతే మాత్రం టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసే అవుతుంది. అటు రేవంత్ సైతం సీనియర్లను కలుపుకొని.. కేసీఆర్ వ్యతిరేక శక్తులను కూడగట్టుకుని పోతేనే... గులాబీ దళానికి గట్టి పోటీ ఇవ్వగలుగుతారు. .. ఇక కోదండరామ్, చెరుకు సుధాకర్, షర్మిల పార్టీలు సైతం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు సహాయ పడతాయే తప్ప.. ప్రత్యామ్నయాలు కావు.. సో ఇప్పటికైతే రేవంత్ అయినా.. బండి అయినా... టీఆర్ఎస్కు డోంట్ కేర్ అన్న వాదనలే వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమన్నది చరిత్ర చెప్పిన సత్యం. ఎన్నో అద్భుత పథకాలు ప్రవేశపెట్టిన నేతలు... ఆ తర్వాతి ఎన్నికల్లో ఓటమి చవిచూసిన సందర్భాలున్నాయి. ప్రజలు ఓడించాలనే నిర్ణయానికి నిర్ణయానికి వస్తే... ఎలాంటి రాజకీయ సమీకరణాలు, ఎత్తుగడలు పనిచేయవన్నది కఠోర వాస్తవం.
Margam Srinivas
Telangana Bureau Chief
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com