TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు శ్రవణ్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. నోటీస్ ప్రతిని ఈనెల 26నే హైదరాబాద్లోని ఆయన కుటుంబసభ్యులకు సిట్ అందించింది. పోలీస్ విచారణకు సహకరించాలని శ్రవణ్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది మార్చిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్పై కేసు నమోదు అయింది. కేసు నమోదు అయిన విషయం తెలుసుకున్న శ్రవణ్ రావు వెంటనే అమెరికా వెళ్లిపోయారు. అమెరికాలో తల దాచుకున్న ఆయన కోసం రెడ్ కార్నర్ నోటీసు జారి చేశారు. దీంతో శ్రవణ్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ.. పోలీస్ విచారణకు సహకరించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈరోజు శ్రవణ్ రావు సిట్ విచారణకు హాజరవుతారా లేదా అన్న అంశంపై సందిగ్ధం నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com