Huzurabad By Election: హుజురాబాద్లో మోసపోయే వారు ఎవరూ లేరు: బండి సంజయ్

bandi sanjay (tv5news.in)
Huzurabad By Election: హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం స్పీడందుకుంది.. పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ, కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరోవైపు ఉప ఎన్నిక కారణంగా దళితబంధు పథకాన్ని హుజురాబాద్లో నిలిపివేస్తున్నట్లు ఈసీ ప్రకటించిన నేపథ్యంలో ఇదే అస్త్రంతో విమర్శలకు పదును పెడుతున్నాయి.
దళితబంధును ఆపిన పాపం బీజేపీదేనని టీఆర్ఎస్ ప్రచారం చేస్తుంటే.. దమ్ముంటే రుజువు చేయాలని బీజేపీ నేతలంటున్నారు.. దీంతో ఉప ఎన్నిక ప్రచారం సెగలు రేపుతోంది. దళితబంధు ఆపాలని తాము లేఖ రాశామంటూ టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు.. దీనిపై యాదాద్రి ఆలయంలో ప్రమాణానికి తాము సిద్ధమన్నారు.. కేసీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు..
హుజురాబాద్ నియోజకవర్గంలోని అంకుశాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బండి సంజయ్ టీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు. ఈటల రాజేందర్ ఇక్కడ్నుంచే దళిత బంధు కోసం యుద్ధం ప్రారంభిస్తారని చెప్పారు. వీణవంక మండలం కిష్టంపేటలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు.. తనకు ఏ బాధ్యత ఇచ్చినా సమర్థవంతంగా నిర్వహించానని చెప్పారు.
హుజుర్నగర్, నాగార్జున సాగర్ లాంటి చోట్ల మోసం చేయవచ్చని.. కానీ, హుజురాబాద్లో మోసపోయే వారు ఎవరూ లేరని అన్నారు. ప్రేమకు లొంగే ప్రజలున్నారని, అవసరమైతే బరిగీసి కొట్లాడుతారని ఈటల అన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా టీఆరెస్ గ్రాఫ్ పెరగడం లేదనే బ్రహ్మాస్త్రంలా ఓటుకు 20వేలు ఇస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు.
కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కూడా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.. మొత్తంగా ఎవరి రాజకీయం వారిదే అన్నట్టుగా హుజురాబాద్లో పరిస్థితి మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com